బాలయ్యను కామెడీ చేయకుంటే చాలు

నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అదే స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన తెరపై విజృంభించి నటిస్తే అభిమానులకు ఆనందం. ఆయన పాత్ర పేవలంగా ఉండి, కామెడీగా తయారైతే యాంటీ ఫ్యాన్స్‌కు అంతకుమించిన ఆనందం. ‘నరసింహనాయుడు’ తర్వాత నడిచిన బ్యాడ్ ఫేజ్‌లో బాలయ్య కొన్ని చెత్త పాత్రలు చేయడం.. మరీ సిల్లీగా అనిపించే తొడగొడితే ట్రైన్ వెనక్కెళ్లే తరహా సన్నివేశాల్లో నటించడంతో ఆయన కామెడీ అయిపోయారు.

ఇక అప్పట్నుంచి ఆయన మీద ఎన్ని జోకులు పేలుతూ వచ్చాయో తెలిసిందే. ఇక ఈ సోషల్ మీడియా కాలంలో అయితే జనాలక ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతారు. గత ఏడాది బాలయ్య ‘రూలర్’ అనే పేలవమైన సినిమా చేశాడు. అందులో ఒక పాత్ర తాలూకు గెటప్, మేకప్ కామెడీ అయిపోయాయి. అది అభిమానులకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది.

ఐతే ఇంతకుముందు బాలయ్యను స్లంప్ నుంచి బయటపడేసిన బోయపాటి మరోసారి ఆయనతో సినిమా చేస్తుండటంతో నందమూరి అభిమానులు ఎంతో భరోసాతో ఉన్నారు. బాలయ్యకు బోయపాటి పునర్వైభవం తెస్తాడనుకుంటున్నారు. కానీ బోయపాటి చివరిగా చేసిన ‘వినయ విధేయ రామ’ చూశాక గుబులు పుడుతోంది. అందులో కొన్ని సీన్లు ఎలా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. అలాంటి సినిమా బాలయ్య చేసి ఉంటే ట్రోలింగ్ ఏ రేంజిలో ఉండేదో ఊహించడమే కష్టం.

ఐతే ఇప్పుడు తన సినిమాలో బాలయ్య అఘోరా పాత్ర చేస్తున్నట్లు బోయపాటి ధ్రువీకరించడంతో అభిమానుల్లో కొంత ఎగ్జైట్మెంట్‌తో పాటు ఆందోళన కూడా కనిపిస్తోంది. ఆ పాత్ర సరిగ్గా ఉంటే సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ తేడా కొడితే మాత్రం నవ్వుల పాలూ కావచ్చు. బాలయ్య పాత్రలకు సంబంధించి గత అనుభవాల నేపథ్యంలో ఈ పాత్ర ఎక్కడ తేడా కొడుతుందో అన్న భయం నందమూరి అభిమానుల్లో లేకపోలేదు. ఈ పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ.. ట్రోలింగ్‌కు గురి కాకుంటే చాలు అన్నది వారి ఆలోచన.