పరీక్షలా ? విద్యార్ధుల ప్రాణాలా ?

జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉన్నా, కేసులు ఎన్ని వేలు నమోదవుతున్నా 10వ తరగతి పరీక్షలను మాత్రం యధాతథంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. జగన్ తాజా నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలిసికూడా జగన్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ఎందుకింతగా పట్టుదలకు పోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు.

నిజానికి 10వ తరగతి పరీక్షలు నిర్వహించకపోయినా వచ్చే నష్టంలేదు. ఎందుకంటే ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దుచేసి ఆటోమేటిక్ పాస్ చేసేయాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించేశాయి. కొన్ని రాష్ట్రాలు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాయంటే తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు కాబట్టే. పరీక్షలకన్నా విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమని కూడా ఆయా ప్రభుత్వాలు భావించబట్టే పరీక్షలను రద్దుచేశాయి.

కానీ ఏపిలో మాత్రం పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. ప్రజల నుండే కాకుండా ప్రతిపక్షాలు కూడా 10వ తరగతి పరీక్షలను రద్దుచేయాలంటు చాలా డిమాండ్లే చేస్తున్నాయి. అయినా ఎందుకనో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయిపోయారు. సరే షెడ్యూల్ కు ముందేమైనా పరీక్షలను రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయిస్తుందేమో తెలీదు. అయితే అప్పటివరకు విద్యార్ధులతో పాటు తల్లి, దండ్రుల్లో టెన్షన్ తప్పదు.

ఓ అంచనా ప్రకారం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య సుమారు 6 లక్షలు. ఇప్పటికే స్కూళ్ళల్లో టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకిన కారణంగా కొన్ని స్కూళ్ళను మూసేశారు. ఒకవైపు కరోనా నియంత్రణకోసం రాత్రుళ్ళు కర్ఫ్యూపెట్టారు. కరోనా నియంత్రణకు ఇన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇదే సమయంలో పరీక్షల నిర్వహణలో మాత్రం ఎందుకింత మొండిపట్టుదలకు పోతోందో తెలీటంలేదు. పరీక్షల నిర్వహణపై జనాల్లో వ్యతిరేకత పెరగకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.