జగన్ మాటంటే లెక్కలేదా?

అధికార వర్గాలు ఎక్కడైనా ప్రభుత్వ పెద్దల మనసును అర్థం చేసుకుని నడుచుకుంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే రెండేళ్ల నుంచి అధికార యంత్రాంగం మరింతగా ప్రభుత్వాధినేత మనసు తెలుసుకుని నడుచుకుంటుండటం గమనించవచ్చు. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎలా వ్యవహరించారో అందరూ చూశారు.

అధికార పార్టీ బద్ధ శత్రువుగా పరిగణించే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవడంతో అంతకుముందు ఎప్పుడూ పట్టించుకోని టికెట్ల ధరల వ్యవహారంపై దృష్టి సారించారు. రేట్లపై నియంత్రణ తెచ్చారు. ఎప్పుడో దశాబ్దం కిందటి ధరల పట్టికను బయటికి తెచ్చి ఆ ప్రకారమే టికెట్లు అమ్మాలని హుకుం జారీ చేశారు. ఈ విషయంలో ఎక్కడ లేని పట్టుదల చూపించారు. ఐతే ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇప్పుడు థియేటర్ల వ్యవస్థ గురించి పట్టించుకునేవాళ్లు లేరు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఏపీలోని అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించాలని రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐతే ఏపీలోని థియేటర్లలో ఈ నిర్ణయం ఇప్పటిదాకా అమలు కాలేదు. టికెట్ బుకింగ్ యాప్ప్ పరిశీలిస్తే సీటు వదిలి సీటు నింపడం లాంటిదేమీ జరగట్లేదు. వంద శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఐతే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సహా ఏ సినిమాకూ కలెక్షన్లు లేని మాట వాస్తవం. పవన్ సినిమా కూడా నామమాత్రంగా నడుస్తోంది.

ఒకవేళ ఆ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్నట్లయితే అత్యవసరంగా అధికార వర్గాలు ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడానికి చూసేవాళ్లేమో. కానీ ఇప్పుడు మాత్రం సీఎం మాటను కూడా పట్టించుకోకుండా 50 ఆక్యుపెన్సీ అమలు చేయించడంపై దృష్టి సారించట్లేదు. తెలంగాణలో సైతం 50 శాతం ఆక్యుపెన్సీకి ఆదేశాలున్నప్పటికీ దాన్ని థియేటర్లలో అమలు చేయకపోవడం గమనార్హం.