చిరు లాజికల్ పొలిటికల్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు టాటా చెప్పేసి చాలా కాలం అయింది. ఆయన అందరి వాడిగా ముద్ర వేయించుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా అధికార పక్షం, విపక్షం అని తేడా లేకుండా ఎవరితోనూ వ్యతిరేకత తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందరితోనూ సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తన్నారు. ఎవరినీ నొప్పించే, ఇబ్బంది పెట్టే ట్వీట్లు అస్సలు వేయట్లేదు. వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లట్లేదు.

కానీ ఈ మధ్య కాలంలో ఒక్క అంశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. అలాగని విమర్శలేమీ చేయలేదు. మర్యాదపూర్వకంగానే ఓ అంశంలో కేంద్రం పునరాలోచించాలని కోరారు. అది విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే విషయంలోనే. ఆంధ్రులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని ఇప్పటికే ఒకసారి ఆయన ట్విట్టర్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఐతే కొన్నాళ్ల పాటు రాజకీయంగా వేడి రేకెత్తించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం.. ఈ మధ్య కొంచెం చల్లబడింది. అందరూ ఆ అంశం నుంచి పక్కకు వచ్చేశారు. ఎన్నికలు, ఆ తర్వాత కొవిడ్ హడావుడిలో పడిపోయారు. ప్రతిపక్ష నాయకులు కూడా పక్కన పెట్టేసిన ఈ అంశంపై ఇప్పుడు చిరు ట్వీట్ వేయడం విశేషం. ప్రస్తుత కోవిడ్ కల్లోల సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్లు ఆక్సిజన్ దొరక్క అల్లాడుతుంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి వందల టన్నుల ఆక్సిజన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే చిరు ప్రస్తావించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తోందని.. తాజాగా మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్ ఇక్కడి నుంచే వెళ్లిందని.. ఇలా ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేయడం ఎంత వరకు సమంజసమని, దీనిపై ఆలోచించాలని చిరు ట్వీట్ వేశారు. మంచి పాయింట్ పట్టుకుని చిరు వేసిన పొలిటికల్ ట్వీట్‌కు మంచి స్పందనే వస్తోంది.