షర్మిల పార్టీపై పబ్లిక్ టాక్ గురించి ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరమైన ఆర్టికల్

తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఆంధ్రజ్యోతి మిగిలిన వారి కంటే ముందుంది. ఆమె రాజకీయాల్లోకి వస్తారని.. తెలంగాణలోపార్టీ పెడతారని చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు సరికదా.. నవ్వేశారు. ఆ మీడియా సంస్థ యజమాని తనకు తోచిన వంటకాన్ని వండేసి.. తెలుగు ప్రజల మీదకు వదిలేశారంటూ తిట్టిపోసిన వాళ్లు లేకపోలేదు.

చివరకు.. ఆ మీడియా సంస్థ చెప్పినట్లే.. షర్మిల రాజకీయ పార్టీ పెట్టటం తెలిసిందే. ఆమె రాజకీయ పార్టీకి సంబంధించిన కవరేజ్ మిగిలిన వాటితో పోలిస్తే.. ఆంధ్రజ్యోతిలో ఎక్కువగా వస్తుందన్న అభిప్రాయం ఉంది.

ఆ మీడియా సంస్థ.. తాజాగా ఒక అర్టికల్ ను ప్రచురించటం ఆసక్తికరంగా మారింది.
‘‘ఈ నేలపై రాజకీయ దండయాత్రలా’ అంటూ అచ్చు వేసిన ఆర్టికల్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. షర్మిల పార్టీకి దన్నుగా నిలుస్తుందన్న పేరున్న మీడియా సంస్థలో.. ఆమె మూలాల్ని ప్రశ్నించేలా.. తెలంగాణ ఆస్తిత్వాన్ని గుర్తు చేస్తూ.. షర్మిల రాజకీయ పార్టీ ఉనికిని ప్రశ్నించే తీరు సంచలనమే. ఇంతకీ ఆ ఆర్టికల్ లో ప్రస్తావించిన కీలక అంశాల్ని చూస్తే..

‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన ప్రతి పోరాటం, ప్రతి త్యాగం ఎంతో విలువైనవి. చరిత్రలో నిలిచిపోయినవి. రాష్ట్రం వచ్చిన తరువాత పాలకుడి నైజం మారింది. విధానాలు మారాయి తప్ప ఆత్మగౌరవానికి ఢోకా రాలేదు. ఇప్పటి పాలకులపై సంధించబడుతున్న ప్రతి ప్రశ్న, ప్రతి నిరసన, ప్రతి ఆరోపణ వాస్తవమే కావచ్చు. ఇప్పుడు ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు.

తెలంగాణ వారు, తెలంగాణేతరులు పాలకుల తప్పులను ఎత్తి చూపడంలో తప్పులేదు. మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదు కానీ, ఆ వంకతో ఈ నేలపై రాజకీయ దండయాత్రలు చేస్తామంటే ప్రజలు సహించరు. ఘనమైన చరిత్ర గల తెలంగాణ భూమిపుత్రులు స్వాగతించరు, ప్రతిఘటిస్తారు’

‘నిన్న మొన్నటి వరకు మా పాలన మాకేనని నినదించిన జనం ఇక్కడి యాస, బాస ఒంటబట్టని ఆంధ్ర ప్రాంత నేతను నెత్తిన ఎత్తుకుని ఊరేగరు. భారతదేశంలో అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కానీ వారెవరూ అధికారం కోసం షర్మిల వలె పార్టీ పెడతామని అనడం లేదు. ఎందుకంటే ఒక ప్రాంతం మూలసిద్ధాంతం, అక్కడి ప్రజల అస్తిత్వ భావనల గొప్పదనం వారికి తెలుసు. అది డబ్బుతో కొంటే వచ్చేది కాదు’

‘షర్మిల చెబుతున్న, చేస్తున్న రాజకీయగారడీ తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణలో ఎవరూ లేరు. మెట్టినింటి బిడ్డగా షర్మిలకు ఇక్కడ జీవించే హక్కులు, వృత్తిపరమైన హక్కులు, రాజకీయంలో కొనసాగే హక్కులు ఉంటాయి. కానీ ఇక్కడి ప్రజల మీద అధికారం చెలాయిస్తాననే వాదనాపరమైన సందర్భం ఉండదు. పాలనలో భాగస్వామి కావచ్చు. ఇక్కడున్న, ఇప్పుడున్న పార్టీలలో చేరవచ్చు. తన ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలలో మనగలిగే స్వేచ్ఛ ఉంటుంది. అంతకుమించిన చొరవగానీ, ఆధిపత్యం గానీ లభించదు’

‘అమెరికా లాంటి దేశంలో తెలుగువారు అక్కడి రాజకీయ పార్టీలలో చేరి వారి మద్దతుతో పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. అంతే తప్ప కొత్త పార్టీలు పెట్టడం లేదు. అక్కడి రాజకీయ పార్టీలు కల్పించే అనేక హోదాలలోకి ఒదిగిపోతున్నారు. అవకాశాలను పొందుతున్నారు. షర్మిల లాగా స్వయంప్రకటిత అధికారం అంటూ వాదిస్తే అసలుకే మోసం వస్తుంది. జయలలిత కూడా జన్మతః కర్ణాటకకు చెందినవారని అంటుంటారు. ఆమె తమిళనాడులో ఎంజి రామచంద్రన్‌ నెలకొల్పిన పార్టీలో చేరారు తప్ప మొదటగానే సొంతంగా పార్టీ పెట్టలేదు’