ఆ సినిమాపై రూ.180 కోట్లు వృథాయేనా?


ఇండియన్-2.. మూడేళ్ల కిందట అట్టహాసంగా మొదలైన సినిమా. రెండు దశాబ్దాల కిందట సంచలన విజయం సాధించిన ‘ఇండియన్’ (భారతీయుడు)కు ఇది సీక్వెల్. ఈ చిత్రం గురించి దశాబ్దం కిందట్నుంచే చర్చ జరుగుతోంది. శంకర్ డ్రీమ్ ప్రాజెక్టుల్లో అది ఒకటి. సాధ్యం కాదనుకున్న ఈ చిత్రాన్ని మొదలుపెడుతుండటంతో 90ల్లో ‘భారతీయుడు’ చూసి ఊగిపోయిన వాళ్లందరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

అసలు సినిమాలు చేయడమే తగ్గించేసిన కమల్ హాసన్.. కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండటంతో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగింది. కానీ ఈ సినిమా ఏం దిష్టి తగిలిందో ఏమో కానీ.. మొదలైన నాటి నుంచి సమస్యలే. ముందు కమల్‌కు మేకప్ సెట్ కాక కొన్నాళ్లు.. ఆ తర్వాత ఆయన పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల కొన్నాళ్లు ఆగిన ఈ చిత్రం.. ఆపై సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం పుణ్యమా అని పూర్తిగా ఆగిపోయింది. తర్వాత కరోనా ఈ సినిమాకు శాపంగా మారింది.

కరోనా బ్రేక్ తర్వాత అన్ని సినిమాలూ పున:ప్రారంభం అయ్యాయి. కానీ ‘ఇండియన్-2’ మాత్రం పట్టాలెక్కలేదు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.230 కోట్లు అయితే.. అందులో ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇటీవల వెల్లడించింది. తమ సినిమాను పక్కన పెట్టి శంకర్ వేరే చిత్రం (రామ్ చరణ్‌తో చేయబోయేది) మీదికి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. కానీ కోర్టు శంకర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నిజానికి కొన్ని నెలల ముందు శంకరే.. ఈ సినిమా పున:ప్రారంభించకపోతే వేరే ప్రాజెక్టు చూసుకుంటానని లైకా వాళ్లను హెచ్చరించాడు. అప్పుడు వాళ్లేమీ చేయలేకపోయారు. ప్రస్తుతం శంకర్ కమిట్మెంట్లు చూస్తుంటే.. ‘ఇండియన్-2’ను పక్కన పెట్టేసినట్లే ఉన్నాడు. మరోవైపు కమల్ ఏమో ‘విక్రమ్’ సినిమా చేసుకుంటున్నాడు.

అసలు ఈ సినిమా మళ్లీ మొదలు కాకపోవడానికి ప్రధానంగా ఎవరు కారణం అన్నది అర్థం కావడం లేదు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే తప్పంతా కమల్‌దే అంటున్నారు. క్రేన్ ప్రమాద సమయంలో ఆయనకు, లైకా అధినేతలకు గొడవైంది. నిర్మాతల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఆయన కోరుకున్నట్లుగా లైకా వాళ్లు బాధితులకు పరిహారం ఇవ్వలేదని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించే విషయంలో ఆయన సుముఖంగా లేరంటారు. మరి రూ.180 కోట్లు ఖర్చు చేసిన నిర్మాతలు ఆయనతో రాజీ చేసుకుని, అలాగే శంకర్‌తో మాట్లాడుకుని షూటింగ్‌ జరిగేలా చూడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏదేమైనా ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్టు ఇలా మరుగున పడిపోవడం విచారకరం.