చాలా స్పీడుమీదున్న షర్మిల

‘రెండేళ్ళల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది’ …ఇది తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజుల నిరాహార దీక్షను ముగించిన సందర్భంగా షర్మిల పై వ్యాఖ్య చేశారు. తెలంగాణా రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ వ్యాక్యూమ్ ను భర్తీ చేసేంత సీన్ షర్మిలకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న.

టీడీపీ నిర్వీర్యమైపోయిందన్నది వాస్తవం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యేందుకు నానా అవస్తలు పడుతోంది. ఇక బీజేపీది వాపేకానీ బలుపు కాదనేది జనాబిప్రాయం. ఈ పరిస్దితుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యర్ధిపార్టీల నుండి పెద్దగా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం లేదన్నది వాస్తవం. అయితే టీఆర్ఎస్ ను ఢీ కొనేంత సీన్ ప్రత్యర్ధులకు లేకపోతే ఆపనిని జనాలే చేస్తారు.

టీఆర్ఎస్ కు ప్రత్యర్ధులను జనాలే తయారుచేస్తారు. ఈ పద్దతిలోనే బీజేపీని నాలుగు ఎంపి స్ధానాల్లో జనాలు గెలిపించారు. అయితే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రజాక్షేత్రంలో దశాబ్దాలుగా ఉన్న పార్టీలే. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్ధితి బాగా క్షీణించిపోయింది. పూర్వవైభవం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో రాజన్నరాజ్యం అంటు షర్మిల తెలంగాణాలో అడుగుపెట్టారు.

రాజకీయాధికారం అందుకోవాలని అనుకోవటంలో తప్పులేదు కానీ అందుకు అవసరమైన అడుగులు వేస్తున్నారా ? అన్నదే సందేహం. ఎందుకంటే ఇంతవరకు పార్టీ పెట్టలేదు. జెండా, అజెండా, పాలసీ ఏమీ ప్రకటించలేదు. పార్టీ పెట్టకుండానే నిరాహారదీక్ష చేస్తే పెద్దగా స్పందన కనిపించలేదు. అలాంటిది అసలు పార్టీనే పెట్టకుండా రెండేళ్ళల్లో అధికారంలోకి వచ్చేస్తామని షర్మిల చేసిన ప్రకటనే హాస్యాస్పదంగా ఉంది.

అధికారంలోకి రావటమే అజెండాగా తెలంగాణాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఏపిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటివాళ్ళు చాలా ప్రకటనలు చేసి చివరకు అభాసుపాలయ్యారు. కాబట్టి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని షర్మిల జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కోదండరామ్, పవన్ జాబితాలో చేరిపోవటం ఖాయం.