జగన్ జీ.. టికెట్ రేటు రూ.100 చేయండి

కరోనా ధాటికి కుదేలైన రంగాల్లో థియేటర్ ఫీల్డ్ ఒకటి. మిగతా రంగాలన్నీ లాక్ డౌన్ షరతుల నుంచి త్వరగానే బయట పడ్డాయి. కానీ థియేటర్లు మాత్రం ఏకంగా ఏడు నెలల పాటు మూతపడ్డాయి. తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినా.. పూర్తి స్థాయిలో నడవడానికి, పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. కరోనా ధాటికి దెబ్బ తిన్నారంటూ ఏపీలో ఎగ్జిబిటర్లందరికీ ఈ మధ్య ఒక చిన్న రిలీఫ్ ప్యాకేజీ ఇచ్చింది జగన్ సర్కారు.

థియేటర్లు నడవని కాలంలో వచ్చిన మూడు నెలల మినిమం విద్యుత్ బిల్లుల్ని రద్దు చేసింది ప్రభుత్వం. దాని వల్ల పెద్దగా ఉపశమనం ఏమీ దక్కకపోయినా.. ఆ మాత్రానికే సంతోషించారు ఎగ్జిబిటర్లు. కానీ ఇప్పుడు వారికి పెద్ద షాకిస్తూ ఎప్పుడో దశాబ్దం కిందటి జీవోను బయటికి తీసి అందులో పేర్కొన్న ధరల ప్రకారమే టికెట్లు అమ్మాలంటూ షరతు విధించడం వారికి పెద్ద షాక్. ఆ రేట్లతోనే వారం కిందట్నుంచి ‘వకీల్ సాబ్’ను నడిపిస్తున్నారు. ఏపీ సర్కారు పవన్ సినిమా అయిన ‘వకీల్ సాబ్’ను దెబ్బ తీయడానికే టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చిందన్నది స్పష్టం. ఐతే ఆ రేట్లతో థియేటర్ల మనుగడే అసాధ్యమన్నది ఎగ్జిబిటర్ల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కారుకు ఓ వినతి పత్రాన్ని ఇచ్చింది ఏపీ ఎగ్జిబిటర్ల సంఘం. ప్రభుత్వం ఇటీవల బయటికి తెచ్చిన జీవో చాలా పాతదని.. అప్పట్లో ట్యాక్స్ విధానం వేరుగా ఉండేదని.. ఇప్పుడు జీఎస్జీ ఎంతో భారంగా మారిందని.. ఒకప్పుడు కొత్త సినిమాలు ‘ఎ’ సెంటర్లలో రిలీజైన కొన్ని వారాలకు ‘బి’ సెంటర్లలో.. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ‘సి’ సెంటర్లలో రిలీజయ్యేవని.. అందుకే రేట్ల అంతరం ఉండేదని పేర్కొన్నారు. 

కానీ గత కొన్నేళ్లలో చిన్న చిన్న సెంటర్లలో సైతం కొత్త సినిమాలు నేరుగా రిలీజవుతున్నాయని.. పైగా చిన్న సెంటర్లలో కూడా థియేటర్లు మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు అధునాతన సౌకర్యాలతో ముస్తాబయ్యాయని.. ఎ, బి, సి అని తేడా లేకుండా పవర్ బిల్లులైనా, పన్నులైనా సమానం అని.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పేర్కొన్న ధరల ప్రకారం టికెట్లు అమ్మడం సాధ్యం కాదని.. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా కనీస టికెట్ ధర రూ.40కి తగ్గకుండా ఉండేలా, అలాగే గరిష్ట ధర కామన్‌గా రూ.100 ఉండేలా చూడాలని ఇందులో విజ్ఞప్తి చేశారు.

ఈ వినతి పత్రాన్ని ఏపీ సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపారు. త్వరలోనే ఎగ్జిబిటర్ల సంఘం ముఖ్యమంత్రిని కూడా ఈ విషయమై కలవబోతోంది. సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రిని కలుస్తారని సమాచారం.