షర్మిలది కంప్లీటుగా రాంగ్ డెసిషనేనా?

జరిగింది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి కొత్త రాజకీయపార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టేశారు. మొన్నటికి మొన్ననే ఖమ్మంలో బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంపై బహిరంగసభలోనే కేసీయార్ ను సూటిగా ప్రశ్నించారు. ఇంతవరకు ఇంతవరకు బాగానే ఉంది.

ఇంతటితో ఆగితే బాగుండేది. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర మూడురోజుల దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రకటించినట్లే ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర, రెండు రోజులు లోటస్ పాండ్ లోను దీక్షను చేశారు. షర్మిల వ్యవహారం ఎలాగైపోయిందంటే దీక్ష చేయను చేశారు… ముగించను ముగించేశారు అన్నట్లుగా తయారైంది.

ఎందుకంటే షర్మిల చేసిన దీక్షపై జనాల్లో పెద్దగా స్పందన కనబడలేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే షర్మిలది పూర్తిగా రాంగ్ టైమింగ్ అని అర్ధమైపోయింది. ప్రజా సమస్యలపై దీక్షలు చేయటం ఆహ్వానించదగ్గదే. అయితే చేసే దీక్షలకు సమయం, సందర్భం చూసుకోవాలి. ఈ విషయంలోనే షర్మిల టైమింగ్ మిస్సయిపోయారనే టాక్ నడుస్తోంది.

రాంగ్ టైమింగ్ ఎలాగంటే మొదటిది నాగార్జున సాగర్ ఉపఎన్నిక హీట్ పెరిగిపోయింది. రెండోది కరోనా వైరస్ సమస్య బాగా పెరిగిపోవటం. ఈ రెండు కారణాల వల్ల షర్మిల దీక్షకు రావాల్సినంత మైలేజి రాలేదు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక హీట్ బాగా పెరిగిపోయింది. ఉపఎన్నిక కారణంగా మొత్తం మీడియా అటెన్షన్ అంతా సాగర్లోనే ఉంది. అలాగే పెరిగిపోతున్న కరోనా వైరస్ కారణంగా మూడు రోజుల దీక్షకు పోలీసులు అనుమతివ్వలేదు

వీటికి అదనంగా మొదటిరోజు దీక్ష కాగానే వేదిక లోటస్ పాండ్ కు మారింది. అంటే షర్మిల ఇంటికి మారింది. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయటానికి ఇంటిదగ్గర దీక్ష చేయటానికి చాలా వ్యత్యాసముంది. అన్నిటికి మంచి కేసీయార్ ను వ్యతిరేకించే వర్గాలు చాలానే ఉన్నప్పటికీ షర్మిలను సీమాంధ్ర కిందే లెక్కేస్తున్నారు.

అందుకనే ఇందిరాపార్క్ దగ్గర జరిగిన దీక్షలో తెలంగాణా నుండి పెద్దగా మద్దతు కనబడలేదు. పైగా పార్టీ పెట్టలేదు, పాలసీ ఏమిటో చెప్పలేదు. జెండా ఏమిటో తెలీదు, అజెండా ప్రకటించలేదు. ఇందుకే వ్యక్తిగతహోదాలో షర్మిల చేసిన దీక్షకు ప్రజాస్పందన కనబడకుండానే ముగించాల్సొచ్చింది. ఇందుకనే షర్మిల దీక్ష కంప్లీటుగా రాంగ్ టైమింగ్ అని తేలిపోయింది.