ముప్పేట చిక్కుల్లో జ‌గ‌న్‌.. వివేకా కేసులో సాక్ష్యం దొరికేసిందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించిన కేసు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటూ తేల‌లేదు. 2019, మార్చి 15న జ‌రిగిన ఈ హ‌త్య‌కు సంబంధించి వైసీపీ నేత‌లు అనేక ట‌ర్న్‌లు తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ కూడా టేక‌ప్ చేసింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నిందితులు ఎవ‌రు? అనేది ఇత‌మిత్థంగా బ‌య‌ట‌కు రాలేదు. ఒక‌వైపు వైఎస్ కుటుంబం నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీఎం జ‌గ‌న్ కేంద్రంగా ఈ హ‌త్య కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా.. సాగుతున్న వివేకా కేసులో.. అనూహ్యంగా సంచ‌ల‌న మ‌లుపు చోటు చేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్ట‌ర్ జ‌న‌రల్‌, ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారుపై పోరాడుతున్న ఏబీ వెంకటేశ్వరరావు వివేకా హ‌త్య కేసుకు సంబంధించి త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌ను స‌మ‌ర్పిస్తాన‌ని ముందుకు రావ‌డం.. ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆయ‌న ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ హత్య దర్యాప్తులో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐకి అందిస్తానని రెండు సార్లు కోరినా.. వారి నుంచి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్న ఆయ‌న‌.. నిఘా విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెళితే వారిని లోనికి రానీయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డుకున్నారని లేఖలో తెలిపారు.

వివేకా హత్య కేసులో ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ ఏబీ సీబీఐకి లేఖను సంధించారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకా ఆయన స్వగృహంలో మరణించారన్న వెంకటేశ్వరరావు.. గుండెపోటుతో ప్రమాదవశాత్తూ బాత్రూంలో జారిపడి మరణించారని మధ్యాహ్నం వరకు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైందని లేఖలో తెలిపారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత హత్య కేసుగా తేలిందని ఆయన లేఖలో గుర్తుచేశారు. ఆసుపత్రికి చేరేవరకు మృతదేహం వారి బంధువుల ఆధీనంలోనే ఉందని వివరించారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎన్.ఎం సింగ్ నేతృత్వంలో బృందం వైఎస్ వివేకా కేసు దర్యాప్తు చేస్తుందన్న వెంకటేశ్వరరావు.. రెండు సార్లు ఆయన్ని ఫోన్లో సంప్రదించినట్లు తెలిపారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న వివరాలను అందజేస్తానని చెప్పినట్లు వివరించారు. కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని జేడీకి తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన తాను కేసు దర్యాప్తునకు సహకరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. ఏ అధికారీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. ఏపీ నిఘా విభాగం వద్ద ఉన్న అప్పటి సమాచారాన్ని తీసుకునేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని.. ప్రస్తుత అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని లేఖలో కోరారు. ఈ ప‌రిణామంతో సీఎం జ‌గ‌న్ అడ్డంగా ఇరుక్కున్నార‌నే వాద‌న వ‌స్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.