బాబు హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం.. సంచ‌ల‌న నిర్ణ‌యం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న తాజాగా చేశారు. రాజ‌కీయాల్లో నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ప‌రిపాటే అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్‌.. 40 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఏం మాట్లాడినా.. ఆచి తూచి మాట్లాడుతుంటారు. అదేవిధంగా పెద్ద‌గా స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్ల జోలికి కూడా పోరు. అయితే.. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న చూసి.. ఆయ‌న ర‌క్తం ఉడికిపోతోంది(ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చారు) ఈ క్ర‌మంలో.. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు స‌వాళ్లు రువ్వుతున్నారు.

అదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు సైతం చేస్తున్నారు. తాజాగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక కోసం ప్ర‌చారం ముగిసిన నేప‌థ్యంలో ఆయ‌న‌.. స‌త్య‌వేడు ప్రాంతంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతులు, వ్యాపార వ‌ర్గాలతో ఆయ‌న మాట్లాడారు. సత్యవేడు మండలం పరిధిలోని ఇసుక రేవుల వ‌ద్ద చంద్రబాబు పర్యటించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై ప్రజల తరఫున తాను పోరాడతానన్నారు. న్యాయం కోసం తాను అవ‌స‌ర‌మైతే జైలు కెళ్లడానికైనా సిద్ధమని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప్ర‌క‌ట‌న గ‌తంలో చేయ‌లేద‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సోదరుడు ఇసుకను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. మొత్తంగా సత్యవేడు మండల పరిధిలోని 3 ఇసుక రేవులను పరిశీలించారు. అరణియార్ నదిపై నాగలాపురం మండల పరిధిలో సురుటుపల్లి, నందనం, సుబ్బానాయుడు కండ్రిగ గ్రామాల వద్ద ఇసుక రేవులు ఉన్నాయని… అక్కడి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా రని స్థానికులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

పొలాల నుంచి అడ్డంగా రోడ్లు ఏర్పాటు చేసుకుని భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్నట్లు రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ.. అక్కడి నుంచి తరలిస్తుండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా నివారించడానికి వారి తరఫున పోరాటం చేస్తానని.. న్యాయం కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి.