దేశంలో కుంభమేళా కలకలం

ఉత్తరాఖండ్ లోని హరిద్వారాలో జరుగుతున్న కుంభమేళ కరోనా వైరస్ నేపధ్యంలో కలకలం సృష్టిస్తోంది. రోజుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కుంభమేళాను అదుపుచేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ఒకవైపు చెబుతున్న కేంద్రప్రభుత్వం అసలు కుంభమేళాకు ఎలా అనుమతిచ్చిందనేదే అసలైన ప్రశ్న.

కుంభమేళాలో రోజుకు సగటున 28 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు అంచనా. ఇన్ని లక్షలమంది ఒకేసారి వివిధ ఘాట్లలో స్నానాలు చేయటం, ఒకేచోట పూజలు చేస్తుండటంతో కరోనా వైరస్ చాలా స్పీడుగా వ్యాపిస్తోంది. అధికారికంగా రోజుకు వెయ్యిమందికి కరోనా వైరస్ సోకుతున్నట్లు చెబుతున్నారు. అంటే అనధికారికంగా ఈ లెక్క భారీగా ఉంటుందని అంచనా.

సోమవారం 28 లక్షల మంది భక్తులు కుంభమేళాకు హాజరైతే కరోనా టెస్టులు చేసింది కేవలం 18,169 మందికి మాత్రమే. అంటే కనీసం ఒక్కశాతానికి కూడా ప్రభుత్వయంత్రాంగం పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించిన వారిలో వెయ్యిమందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. మరి మిగిలిన 27 లక్షల చిల్లర భక్తులకు కూడా టెస్టులు చేస్తే ఎంతమందికి సోకిందనే విషయం బయపటడుతుంది.

అయితే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ నే కాబట్టి కోవిడ్ నిబంధనలను పాటించకపోయినా ఎవరు పట్టించుకోవటంలేదు. పైగా కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు సూపర్ స్ప్రెడర్లు కారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. లక్షలాదిమంది భక్తులు కరోనా వైరస్ సూపర్ స్ర్పెడర్లు కాకపోతే మరి మిగిలిన రాష్ట్రాల్లో జన సమూహాల విషయాల్లో కేంద్రం ఎందుకని ఆందోళన పడుతోంది.