రెండుచోట్లా బీజేపీ పరిస్ధితి సేమ్ టు సేమ్ ?

తెలంగాణా, ఏపిలో రెండు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలోను బీజేపీ మాత్రం తిరుపతి లోక్ సభకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేసేందుకు తెలంగాణా బీజేపీ నేతలు కూడా వరుసగా క్యూ కడుతున్నారు కాబట్టి.

నిజానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. దీంతో పోల్చుకుంటే నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనే కమలం కాస్త మెరుగని ప్రచారం జరిగింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన బీజేపీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిజానికి దుబ్బాకలో గెలిచేంతసీన్ కమలంకు లేదు. టీఆర్ఎన్ నిర్లక్ష్యానికి తోడు అనేక అంశాలు కలిసొచ్చి బీజేపీ అక్కడ గెలిచిందంతే.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పైనున్న వ్యతిరేకత+ఎంఐఎంను టార్గెట్ చేయటం లాంటి అనేక అంశాలతో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. అదే ఊపుతో సాగర్ ఉపఎన్నికలో కూడా గెలుపుమాదే అంటే రెచ్చిపోయారు. అయితే ఈమధ్యనే జరిగిన రెండు ఎంఎల్సీ ఎన్నికల్లోను బీజేపీ ఓడిపోయింది. దాంతో నేతలు ఆకాశం నుండి భూమి మీదకు దిగొచ్చారు. టీఆర్ఎస్ పై రెచ్చిపోవటం, కేసీయార్ ను రెచ్చగొట్టడంతో పాటు కమలం ఊపుకూడా తగ్గిపోయింది.

ఇలాంటి అనేక కారణాల వల్ల సాగర్ ఉపఎన్నికల్లో ప్రచారం కన్నా తెలంగాణా నేతలు తిరుపతి ప్రచారంవైపే మొగ్గుచూపుతున్నారు. సాగర్లో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అని కమలనాదులకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే దుబ్బాక ఎంఎల్ఏ రఘునందనరావు, మాజీమంత్రి బాబూమోహన్ తో పాటు అనేకమంది బీజేపీ నేతలు తిరుపతిలో ప్రచారం చేశారు. సరే ఎవరు ప్రచారం చేసినా చెప్పేదేమిటంటే తిరుపతి ఉపఎన్నికలో దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని.

కానీ వీళ్ళు మరచిపోయిందేమంటే దుబ్బాకలో కేసీయార్ నిర్లక్ష్యంచూపించారు. సానుభూతి ఓట్లే గెలిపిస్తాయనే భ్రమలో ఉండటమే దెబ్బకొట్టింది. కానీ తిరుపతిలో జగన్ నిర్లక్ష్యంగా లేరు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ కమలనాదులు నేతలు చెబుతున్నట్లుగా దుబ్బాక రిజల్టే రిపీటయినా అది బీజేపీకి అనుకూలంగా కాదు దానికన్నా ముందు టీడీపీ ఉందన్న విషయం మరచిపోకూడదు.