ఉపఎన్నికలో బీజేపీ విపరీతం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ చేసిన పని అందరికీ విపరీతంగానే అనిపిస్తోంది. తాజాగా ఉపఎన్నిక విషయంలో కమలనాదులు మ్యానిఫెస్టోను విడుదల చేయటమే ఈ చర్చకు దారితీసింది. ఒక ఉపఎన్నిక కోసం ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ నేతలు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆచరణ సాధ్యంకాని హామీలన్నింటినీ గుప్పించేటప్పటికి కమలనాదుల చర్య అందరికీ వైపరీత్యంగానే కనిపిస్తోంది.

సాధారణ ఎన్నికల సమయంలో పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేయటం సహజం. గెలిస్తే తాము ఏమి చేయబోతున్నామనే విషయాన్నే హామీల రూపంలో పార్టీలు మ్యానిఫెస్టోలో స్పష్టం చేస్తాయి. సరే గెలిచిన తర్వాత వాటిని ఎంతవరకు ఆచరిస్తాయనేది వేరేసంగతి. ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క ఎంఎల్ఏ గానీ ఒక్క ఎంపి గాని లేరు. అలాంటిది తిరుపతి ఉపఎన్నికలో గెలిచనంత మాత్రాన తన హామీలను ఏ విధంగా అమలు చేద్దామని అనుకుంటున్నదో అర్ధం కావటంలేదు.

మ్యానిఫెస్టోను తయారుచేసిన వాళ్ళు, రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకందరికీ తెలుసు మ్యానిఫెస్టో అంటే జనాలు నవ్వుకుంటారని. అయినా సరే విడుదల చేశారంటే జనాలను సదరు నేతలు ఏ స్ధాయిలో ఊహించుకుంటున్నారో అర్ధమైపోతోంది. ఈమధ్యనే జరిగిన పంచాయితి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇలాగే ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను విడుదల చేసి నవ్వులపాలైన విషయం అందరికీ తెలిసిందే.