అక్కకి పెద్ద షాకిచ్చిన పవన్

ఎన్నికలు చివరిదశకు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పెద్ద షాకే ఇచ్చాడు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గెలుపుకోసం ఒకసారి అంటే మొన్నటి 3వ తేదీన తిరుపతిలో రోడ్డుషో నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేరు. ఒకవైపు బీజేపీయేమో ఓట్లకోసం అచ్చంగా పవన్ పైనే ఆధారపడింది. ఈ దశలో కమలనాదులకు పవన్ గట్టి షాకిచ్చాడు. పవన్ను అభ్యర్ధి రత్నప్రభ తమ్ముడు అని సంబోదిస్తుంటుంది. అందుకనే అక్కడ తమ్ముడు షాకిచ్చినట్లుగానే కమలనాదులు చెప్పుకుంటున్నారు.

12వ తేదీ అంటే సోమవారం బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా తిరుపతిలో ప్రచారానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. పవన్ సన్నిహితులు, వ్యక్తిగత సిబ్బందిలో చాలామందికి కరోనా వైరస్ సోకిందట. దాంతో ఎవరికి వాళ్ళుగా డ్యూటీల నుండి పక్కకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇన్నిరోజులు పవన్ కు సమీపంగానే మెలిగిన అంతమంది సిబ్బందికి కరోనా వైరస్ సోకిన తర్వాత పవన్ కు రాకుండా ఉంటుందా అనేది సందేహం.

నిజానికి పవన్ కరోనా వైరస్ టెస్టు చేయించుకున్నారా ? కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయంలో ఎవరికీ సరైన సమాచారంలేదు. అయితే గడచిన మూడు రోజుల క్రితంనుండి పవన్ తనంతట తానుగా హోం క్వారంటైన్ పాటిస్తున్నట్లు చెప్పారట. దాంతో జనసేనానికి కరోనా వైరస్ సోకుంటుందని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్లో కూడా కనబడలేదు. పోలింగ్ మరో మూడు రోజుల్లో ముగిసేముందు సరిగ్గా పవన్ హోం క్వారంటైన్ లోకి వెళిపోవటం బీజేపీకి గట్టి షాకనే చెప్పాలి.