‘వకీల్ సాబ్’ టికెట్ల గొడవ అయిపోలేదు

‘వకీల్ సాబ్’ రిలీజ్ ముందు రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సినిమా చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో దీన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. ఎందుకంటే ఈ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దు చేశారు. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చారు.

తెలంగాణలోనూ బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవు కాబట్టి ఏపీలో వాటిని రద్దు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అది అనివార్యం. కానీ టికెట్ల రేట్ల మీద నియంత్రణ తేవడం మీదే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం రిలీజైన ‘వైల్డ్ డాగ్’తో పాటు గత కొన్ని నెలల్లో రిలీజైన చాలా సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. ‘వకీల్ సాబ్’కు మాత్రం నియంత్రణ అంటుండటం రాజకీయ కుట్రలో భాగమే అని భావిస్తున్నారు.

ముందు ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచొద్దంటూ జీవో ఇవ్వడం.. ఆ తర్వాత కోర్టు ఆ జీవోను కొట్టేయడం.. ఆపై ప్రభుత్వం మళ్లీ కోర్టుకు వెళ్లి టికెట్ల రేట్లు పెంచకుండా ఆదేశాలు తెచ్చుకోవడం తెలిసిందే. అంతటితో వ్యవహారం ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఈ గొడవ ఇంతటితో ముగిసిపోలేదు. ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి మళ్లీ కోర్టుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ‘వకీల్ సాబ్’ విషయంలో ప్రభుత్వం ఎలా వివక్ష ప్రదర్శిస్తోందో వివరిస్తూ సోమవారం డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం.

గత కొన్ని నెలల్లో రిలీజైన సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించి.. ‘వకీల్ సాబ్’ విషయంలో మాత్రం అడ్డు పడటం, అలాగే దశాబ్దం కిందటి టికెట్ల రేట్లకు సంబంధించి జీవోను ఇప్పుడు ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాళ్లు కోర్టులో పోరాడాలని నిర్ణియించుకున్నట్లు తెలిసింది. మరి ఈసారి కోర్టు ఏమంటుంది.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.