బాలయ్య ఉగాదికి చెప్పేస్తాడు

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ విషయంలో ఎంత సస్పెన్స్ నడుస్తోందో తెలిసిందే. బోయపాటి శ్రీను చాలా వరకు తన సినిమాలు మొదలైనపుడు టైటిల్ ప్రకటించడు. కొంత మేకింగ్ అయ్యాక ప్రత్యేకంగా టైటిల్ ప్రకటిస్తుంటాడు. ఐతే బాలయ్యతో ఆయన చేస్తున్న కొత్త సినిమా పట్టాలెక్కడంలో కొంత ఆలస్యం జరిగింది. అలాగే కరోనా విరామం వల్ల సినిమా మరింత ఆలస్యం అయింది. దీంతో ఈ సినిమా టైటిల్ కోసం ఏడాది పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ ఏడాదిలో టైటిల్ గురించి ఎన్ని ఊహాగానాలు వినిపించాయో లెక్కే లేదు. మోనార్క్ అని, గాడ్ ఫాదర్ అని ఈ సినిమాలకు రకరకాల టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం బయటికి రాలేదు. బోయపాటి మనసులో ఏముందన్నది ఎవరికీ తెలియలేదు. ఐతే ఎట్టకేలకు ఈ సస్పెన్సుకు బోయపాటి తెరదించేయబోతున్నాడు.

ఉగాది సందర్భంగా ఈ మంగళవారం బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. కాబట్టి ఏడాదికి పైగా సాగుతున్న నందమూరి అభిమానుల నిరీక్షణకు రెండు రోజుల్లో తెరపడబోతుందన్నమాట. ప్రచారంలో ఉన్న వాటిలో ఒక టైటిలే బోయపాటి ఎంచుకున్నాడా.. లేక కొత్త పేరుతో ఆశ్చర్యపరుస్తాడా అన్నది చూడాలి.

బోయపాటితో ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బాలయ్య సరసన ఇందులో ప్రగ్యా జైశ్వాల్, సాయేషా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్రణాళికల్లో టీం ఉంది. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అనుకున్న ప్రకారం సినిమా వస్తుందా అన్నది డౌటే.