ష‌ర్మిల వ్యూహం సాగుతుందా? రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

త‌న సంక‌ల్ప యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌.. వైఎస్ ష‌ర్మిల‌.. చేసిన వ్యాఖ్య ‌లు ఏమేర‌కు ఫ‌లిస్తాయి? తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన ఆమె ప్ర‌య‌త్నం.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? వంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ మేధావుల మ‌ధ్య చ‌ర్చ‌గా మారాయి. ఖమ్మంలో వైఎస్‌ షర్మిల నిర్వహించిన సంకల్ప సభ.. టీఆర్ఎస్‌ టార్గెట్‌గానే జరిగింది. సభ ప్రారంభం నుంచి చివరివరకు ఆసాంతం సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై ష‌ర్మిల విమర్శలు గుప్పించారు.

సభలో షర్మిల సుమారు 40 నిమిషాలపాటు ప్రసంగించగా.. అందులో కాంగ్రెస్‌, బీజేపీల గురించి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మిగతా సమయం మొత్తం సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్‌ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలను, ప్రజా సంక్షేమాన్ని గుర్తుచేస్తూ ప్రస్తుతం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల తీరుపై విమర్శలు గుప్పించారు. వాటన్నింటిని ప్రశ్నించేందుకే.. నిలదీసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేసిన కేసీఆర్‌.. భజన బ్యాచ్‌ని పక్కన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిస అయిందంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే.. ష‌ర్మిల ఇదంతా వ్యూహం ప్ర‌కార‌మే చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌ను సాధించిన నాయ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్‌ను ఎవరూచెరిపి వేసే ప‌రిస్థితి లేదు. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొనే కాంగ్రెస్ కూడా ఈ రేంజ్‌లో కేసీఆర్‌ను ఎప్పుడూ టార్గెట్ చేయ‌లేదు. ఇక‌, ఇక్క‌డ జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా అనేక విష‌యాల్లో విమ‌ర్శించినా.. ష‌ర్మిల మాదిరిగా టార్గెట్ చేసి.. కేసీఆర్‌ను ఏకంగా తెలంగాణ ద్రోహిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అంటే.. తెలంగాణ ప్ర‌జ‌ల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానాన్ని తీసేయ‌లేమ‌ని నిర్ణ‌యించుకున్నారో.. లేక మ‌రేదైనా కార‌ణం కావొచ్చు… ఇత‌ర‌త్రా విష‌యాల‌నుటార్గెట్ చేసుకున్నారు.

కానీ, ఇప్పుడు ష‌ర్మిల.. ఏకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆయ‌నను టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు సంధించా రు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు అంత ఈజీగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మారుస్తాయ‌ని చెప్ప‌లేం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను కాద‌ని.. ఆల్ట‌ర్నేట్ నేత‌ను చేర‌దీసే ప‌రిస్థితిలో తెలంగాణ ప్ర‌జ‌లు లేరు. ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించే వారు కూడా ఆయ‌న‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించిన వారు లేరు. ఇలాంటి ప‌రిస్థితిలో ష‌ర్మిల వ‌చ్చీరావ‌డంతోనే కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డాన్ని ప్ర‌జ‌లు స్వీక‌రించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఈ ప‌రిణామం.. ఆమెకు క‌లిసి రాక‌పోవ‌చ్చ‌ని.. తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగి ఉంటే.. బాగుండేద‌ని సూచిస్తున్నారు. మొత్తానికి సంక‌ల్ప స‌భ‌.. ఆశించిన మేర‌కు వ‌ర్క‌వుట్ అవ‌లేద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.