జ‌న‌సేన టార్గెట్ అక్క‌డే… ఆ సీట్లే ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రికొత్త పొలిటిక‌ల్ స్ట్రాట‌జీతో ఎన్నిక‌ల్లో పోటీకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. త‌మ‌కు బ‌లం లేని చోట క‌న్నా… బ‌లం ఉన్న చోటే పోటీ చేస్తే కొంత వ‌ర‌కు అయినా ప్ర‌భావం చూపుతామ‌న్న ఆలోచ‌న‌లో ఆ పార్టీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ‌కు బ‌లం ఉన్న చోట పోటీ చేసిన ఆ పార్టీ చాలా వ‌ర‌కు ఫ‌లితాలు రాబ‌ట్టుకుంది. కొన్ని చోట్ల బీజేపీతోనూ.. మ‌రి కొన్ని చోట్ల టీడీపీతోనూ పొత్తులు పెట్టుకుని స‌క్సెస్ అయ్యింది. విచిత్రం ఏంటంటే బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఉన్నా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఆ పొత్తును ప‌క్క‌న పెట్టేసి మ‌రీ టీడీపీతో జ‌ట్టు క‌ట్టి ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించింది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ‌కు బ‌లం ఉన్న ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు వైజాగ్‌లోని కొన్ని ప్రాంతాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల‌తో పాటు సీమ‌లో త‌మ‌కు అభిమానులు ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తు ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పొత్తులు ఉన్నా.. లేక‌పోయినా బ‌లం ఉన్న చోటే దృష్టి పెట్టి మ‌రింత బ‌ల‌ప‌డితే క‌నీసం క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ త‌ర‌హాలో అయినా భారీగా సీట్లు గెలుచుకుని ప్ర‌భుత్వాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్లాల‌న్న‌దే ఆ పార్టీ టార్గెట్‌గా తెలుస్తోంది.

ఇక మొన్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌నే తీసుకుంటే గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు కొన్ని చోట్ల ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. మ‌రి కొన్ని చోట్ల గెల‌వ‌క‌పోయినా రెండో స్థానంలో నిలిచి బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. చాలా చోట్ల టీడీపీ చేతులు ఎత్తేసి జ‌న‌సేన‌కు లైన్ క్లీయ‌ర్ చేసింది. విచిత్రం ఏంటంటే చాలా చోట్ల అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే ఎక్కువ ఓట్లు జ‌న‌సేన ద‌క్కించుకుంది. ఇక కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న చోట ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు జ‌న‌సేన వైపే మొగ్గు చూపింది.

ఇక జ‌న‌సేన కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ సైతం త‌ర‌చూ గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీని బ‌లోపేతం చేస్తూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ సినిమాల్లో బిజీ బిజీ అయ్యారు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీని బ‌లంగా ఉన్న చోట మ‌రింత బ‌లోపేతం చేసే బాధ్య‌త‌ల‌ను మ‌నోహ‌ర్‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 35 అసెంబ్లీ స్థానాల్లో బ‌లంగా ఉండ‌డంతో పాటు విజ‌యం సాధించే దిశ‌గా జ‌న‌సేన ప్ర‌ణాళిక‌లు మొద‌లు పెట్టింది. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ? చూడాలి.