జగన్ సర్కారు అప్పు అడిగితే.. ఆర్బీఐ నో చెప్పిందా?

స్థాయికి మించిన సంక్షేమ పథకాలు.. ఆదాయానికి మించిన ఖర్చులు.. వెరసి ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సరిగా లేని పరిస్థితి. కరోనా దెబ్బతో మందగించిన ఆదాయం.. పడిపోయిన రియల్ ఎస్టేట్.. వెరసి ఏపీ ఆర్థిక పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తే.. సంక్షేమ పథకాల్ని అమలు చేయలేరు. అలా అని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ నెల ఆరో తేదీకి వచ్చేసినా మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం మాత్రమే జీతాలు జమ అయిన పరిస్థితి.

ఇలాంటి వేళ.. చేతిలోకి కాసిన్ని నిధుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా బహిరంగ మార్కెట్ నుంచి రూ.2వేల కోట్లు అప్పు తెచ్చుకుంటామని ఏపీ సర్కారు భారత రిజర్వు బ్యాంకును కోరితే.. అందుకు నో చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం నుంచి ముందస్తు అనుమతి తెచ్చుకుంటేనే సెక్యురిటీల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని తేల్చి చెప్పింది.

ఏపీలో దారుణంగా మారిన ఆర్థిక పరిస్థితికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నెలలో ఐదో తారీఖు వచ్చినా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. బ్యాంకులకు వరుస సెలువలు రావటంతో జీతాలు చెల్లించలేకపోయినట్లుగా చెప్పుకున్న ప్రభుత్వాధినేతలు.. సోమవారం కేవలం 35 శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు జరిపారు. అది కూడా అప్పు చేసే కావటం గమనార్హం.

వాస్తవానికి మంగళవారం బాండ్ల వేలం ద్వారా రూ.2వేల కోట్లను సేకరించి.. మిగిలిన వారికి జీతాలు ఇవ్వాలని భావించారు. అందుకు ఆర్బీఐ అడ్డు చెప్పటంతో ఇప్పుడు జీతాలు.. రిటైర్డు ఉద్యగులకు పెన్షన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై ఆర్థిక శాఖ ఆందోళనకు గురవుతోంది. రోజువారీగా వచ్చే ఆదాయం విడతల వారీగా జీతాల చెల్లించేందుకు సరిపోయే పరిస్థితి.ఒకవేళ.. అదే చేస్తే.. ప్రభుత్వ పథకాలు.. సంక్షేమ కార్యక్రమాల్ని ఎలా నిర్వహిస్తారు? అన్నది మరో ప్రశ్న. మరీ.. గడ్డు పరిస్థితిని ఏపీ సీఎం జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి