చేతులెత్తేస్తున్న‌ బాలీవుడ్ బిగ్ మూవీస్

క‌రోనా దెబ్బ‌కు మామూలుగా అల్లాడిపోలేదు బాలీవుడ్. దేశంలో మిగ‌తా ఇండ‌స్ట్రీలు కొంచెం కొంచెం కోలుకున్నాయి. టాలీవుడ్ అయితే ఒక‌ప్ప‌టి స్థాయిలోనే న‌డుస్తోంది. కానీ బాలీవుడ్ మాత్రం వైర‌స్ ప్ర‌భావం నుంచి కోలుకోలేక‌పోతోంది. బాలీవుడ్‌కు కేంద్రం అయిన మ‌హారాష్ట్ర క‌రోనా ప్ర‌భావం ఎంత‌కూ త‌గ్గ‌క‌పోగా, సెకండ్ వేవ్ అక్క‌డ విజృంభిస్తుండ‌టంతో జ‌నాలు సినిమాల ఊసే ఎత్తే స్థితిలో లేరు. ఉత్త‌రాదిన అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం చూపిస్తోంది. దీంతో థియేట‌ర్లు జ‌నాల్లేక వెలవెల‌బోతున్నాయి.

లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వాత థియేట‌ర్లు తెరుచుకున్నాయి కానీ.. సినిమాలు మాత్రం నామ‌మాత్రంగానే ఆడుతున్నాయి. ఈ బ్రేక్ త‌ర్వాత రిలీజైన ఇందు కి జ‌వానీ, మేడ‌మ్ చీఫ్ మినిస్ట‌ర్, రూహి, ముంబ‌యి సెగా.. ఇలాంటి సినిమాల‌న్నీ దారుణంగా దెబ్బ తిన్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా ఫ్లాప్ అయ్యాయి.

తాజాగా వీకెండ్ లాక్ డౌన్ ప్ర‌క‌టించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. మున్ముందు క‌ఠిన ఆంక్ష‌లు త‌ప్పేలా లేవు. ఉత్త‌రాదిన ఎక్క‌డా కూడా సినిమాల‌కు మంచి ప‌రిస్థితులు లేవు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాల రిలీజ్ శ్రేయ‌స్క‌రం కాద‌ని నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గుతున్నారు. వేస‌విలో భారీ చిత్రాల విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్న నిర్మాత‌లు నిర్ణ‌యం మార్చుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగానే వాయిదా ప‌డి, ఏడాదికి పైగా విరామం త‌ర్వాత‌.. ఏప్రిల్ 30న అక్ష‌య్ కుమార్ సినిమా సూర్య‌వంశీని రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. బాలీవుడ్లో భారీ చిత్రాల సందడి ఈ సినిమాతోనే మొద‌ల‌వుతుంద‌నుకున్నారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ సినిమాను వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు. మే 13న రంజాన్ కానుక‌గా రావాల్సిన స‌ల్మాన్ సినిమా రాధె వాయిదా ప‌డ‌టం కూడా లాంఛ‌న‌మే అంటున్నారు. అలాగే ఈ నెల‌లో రావాల్సిన‌ ఇమ్రాన్ హ‌ష్మి సినిమా చెహ్రె, సైఫ్ అలీ ఖాన్ మూవీ బంటీ ఔర్ బ‌బ్లీ-2ను కూడా వాయిదా వేయ‌బోతున్నారు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కోలుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. వేస‌వి మొత్తం వృథా అయ్యేట్లే ఉంది.