కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో కొత్త మార్పులు…!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. కేసీఆర్ తెలంగాణ‌కు రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యి కూడా అప్పుడే రెండున్న‌రేళ్లు అవుతోంది. మ‌రో రెండున్న‌రేళ్లు మాత్ర‌మే ఉంది. 2023 ఎలాగూ ఎన్నిక‌ల సంవ‌త్స‌ర‌మే.. ఇక మిగిలింది ఈ యేడాదిలో 8 నెల‌లు.. వ‌చ్చే యేడాది. అంటే గ‌రిష్టంగా 20 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని 2019 సెప్టెంబ‌ర్‌లో విస్త‌రించి ఆరుగురిని కేబినెట్లోకి కొత్త‌గా చేర్చుకున్నారు. ఇక కేసీఆర్ కేబినెట్లో ధిక్కార స్వ‌రాలు పెరుగుతోన్న మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇచ్చి ఇచ్చి విసిగిన కేసీఆర్ కేబినెట్లో త‌ల‌నొప్పిగా మారిన వారిని నిర్దాక్షిణ్యంగా మ‌ర్చేస్తేనే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

ముఖ్యంగా ఈటెల రాజేంద‌ర్ ఇటీవ‌ల అధిష్టానంపై రుస‌రుస‌లాడుతున్నారు. ఈటెల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఓ మంత్రితో పాటు ఉమ్మ‌డి నల్ల‌గొండ‌, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల‌కు చెందిన మంత్రుల విష‌యంలో కేసీఆర్ అసంతృప్తితో ఉన్నార‌న్న మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే వీరిని త‌ప్పించి కొత్త ముఖాల‌ను కేబినెట్లోకి తీసుకు వ‌స్తార‌ని అంటున్నారు. కొత్త ముఖాల్లో శాస‌న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి, జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి, ఖ‌నాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌, హ‌న్మ‌కొండ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ పేర్ల‌లో ఎవ‌రికి కేబినెట్లో బెర్త్ ద‌క్కుతుందో ? ఎవ‌రు ఆ ల‌క్కీ ప‌ర్స‌న్సో అన్న‌ది చూడాలి. ఇక కేసీఆర్ త‌న కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్నా ఇప్ప‌టికే ఆ ఫ్యామిలీ నుంచి ప‌లువురు మంత్రులు ఉండ‌డంతో అది సాధ్యం కాదు. ఇక ఇటీవ‌ల ఎమ్మెల్సీగా గెలిచిన పీవీ కుమార్తె సుర‌భి వాణి పేరు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నా ఆమెను మండ‌లి చైర్మ‌న్ చేసే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. ఖ‌మ్మంలో ప్ర‌స్తుతం పువ్వాడ అజ‌య్ మంత్రిగా ఉన్నారు. ఇక మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ స‌భ‌ల్లోనూ స‌భ్యుడు కాదు.

పువ్వాడ‌ను ఉంచి పొంగులేటికి ఛాన్స్ ఇస్తారా ? లేదా ఇద్ద‌రికి ఛాన్స్ ఉంటుందా ? అన్న‌ది చూడాలి. పువ్వాడ‌ను త‌ప్పిస్తే సామాజిక స‌మీక‌ర‌ణ లెక్క త‌ప్పుతుంది. అందుకే పొంగులేటి విష‌యంలో స‌స్పెన్స్ ఉంది. గుత్తాకు లైన్ క్లీయ‌ర్ అయితే అదే వ‌ర్గం మంత్రిపై వేటు ప‌క్కా అంటున్నారు. మ‌రి కేసీఆర్ ఫైన‌ల్ డెసిష‌న్లు ఎలా ? ఉంటాయో ? చూడాలి.