ఎందుకు మోడి తమిళనాడును పట్టించుకోవటంలేదు ?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. నిజానికి ఎన్నికలు జరుగుతున్న పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. అలాంటి రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్దగా పట్టించుకోవటం లేదు. అన్నాడీఎంకే పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను వదిలిపెట్టేస్తే కనీసం తమ పార్టీ అభ్యర్ధుల తరపున కూడా మోడి ప్రచారానికి ఇష్టపడటంలేదు.

అతికష్టంమీద శుక్రవారం మధురైలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఒకవైపు పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. మరోవైపు గెలుపు విషయంలో అభ్యర్ధులు అల్లాడిపోతున్నారు. అందుకనే ప్రచారంలో మోడి పాల్గొనాలని చాలామంది నేతలు అడుతున్నారట. అయినా ఎందుకనో తమిళనాడులో ప్రచారం చేయటానికి మోడి పెద్దగా ఇష్టపడటంలేదు. మధురై సభలో పాల్గొనటం కూడా ముఖ్యమంత్రి పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు పదే పదే అడిగిన తర్వాతే అంగీకరించారట.

చూడబోతే జరగబోయే ఎన్నికల్లో ఫలితాల విషయంలో మోడికి మంచి క్లారిటినే ఉన్నట్లుంది. ప్రీపోల్ కు సంబంధించి ఏ సర్వే చూసినా అధికారంలోకి రాబోయేది డీఎంకేనే అని బల్లగుద్ది చెప్పాయి. దాంతోనే అన్నాడీఎంకే+బీజేపీ,మిత్రపక్షాలు డీలా పడిపోయాయి. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే అన్నాడీఎంకేలో నుండి బహిష్కరణకు గురైన శశికళను మళ్ళీ పార్టీలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ప్రకటించింది.

శశికళకు ఉన్న ఇమేజిని ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ప్లాన్ కనబడుతోంది. అయితే పన్నీర్ ఆహ్వానంపై చిన్నమ్మ పెద్దగా స్పందించినట్లు లేరు. అందుకనే ఏమి చేయాలో దిక్కుతోచక వాళ్ళే అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో ప్రచారంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి కూడా తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వీళ్ళు కాకుండా ఇంకా మరికొన్ని కూటములు కూడా పోటీలో ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రాజకీయాలంతా కలగాపులగం అయిపోయాయి. ఎవరి విషయం ఎలాగున్నా తమిళనాడు విషయంలో మోడికి పిచ్చక్లారిటినే ఉన్నట్లుంది.