కన్నడ స్టార్ హీరోకు షాక్

కరోనా విరామం తర్వాత పుంజుకోవడానికి ప్రతి సినీ పరిశ్రమా గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ టాలీవుడ్ మాదిరి మరే పరిశ్రమలోనూ ఉత్సాహం కనిపించడం లేదు. ఇక్కడ దాదాపుగా కరోనాకు ముందు పరిస్థితులు వచ్చేశాయి. థియేటర్లలో మన సినిమాలు చాలా బాగా ఆడేస్తున్నాయి. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. కానీ మిగతా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ భారీ చిత్రాలు రావట్లేదు.

కన్నడ సినీ పరిశ్రమ విషయానికొస్తే దర్శన్ నటించిన ‘రాబర్ట్’తో ఆ ఇండస్ట్రీ రీస్టార్ట్ అయ్యేట్లు కనిపించింది. కానీ ఆ సినిమాకు అంత మంచి టాక్ రాలేదు. వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయంతే. దాని తర్వాత కన్నడిగుల ఫోకస్ అంతా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ మీద నిలిచింది. యువ కథానాయకుల్లో పునీతే అక్కడ బిగ్గెస్ట్ స్టార్. అతడి ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు చాలానే ఉన్నాయి. ‘యువరత్న’ ఆ జాబితాలో చేరుతుందన్న అంచనాలు కలిగాయి.

రొటీన్ మాస్ మసాలా సినిమానే అయినప్పటికీ ‘యువరత్న’కు మంచి టాక్ వచ్చింది. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఐతే సినిమా రిలీజైన రెండో రోజుకే కర్ణాటక ప్రభుత్వం ‘యువరత్న’కు పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లలో ఆక్యుపెన్సీని ఉన్నట్లుండి 50 శాతానికి తగ్గించేసింది. ఈ రోజుల్లో ఓపెనింగ్స్ మీదే సినిమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పుడు 50 శాతం ఓపెనింగ్స్‌లో కోత పడే పరిస్థితి వచ్చింది.

మంచి టాక్ తెచ్చుకుని, భారీగా వసూళ్లు సాధిస్తున్న సినిమాకు ఇలా షాకివ్వడంతో పునీత్ అండ్ కో తట్టుకోలేకపోతోంది. వాళ్లకు ఇండస్ట్రీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కన్నడ స్టార్ నటులు, టెక్నీషియన్లందరూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలు పెట్టారు. ఇప్పటికిప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీల్లేదంటున్నారు. ఫ్యాన్స్ సైతం ఇదే మాట అంటున్నారు. ‘వుయ్ వాంట్ 100 పర్సంట్ ఆక్యుపెన్సీ’ అంటూ కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలుపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.