పెళ్లి చూపులకు వెళ్లి… ఆ యువతితో ఎస్కేప్… చివరికి..?

అందరిలాగే ఓ యువకుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ యువకుడికి యువతి నచ్చింది. కానీ ఇరు కుటుంబాలకు కట్నకానుకల విషయంలో పరస్పరం బేధాభిప్రాయాలు రావటం వల్ల ఈ సంబంధం వద్దనుకున్నారు. కానీ ఆ యువతీ, యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిరువురు ఫోన్ నెంబర్లను మార్చుకొని తరుచు ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది కుదరదని తెలిసిన క్షణంలో వారిద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. వీరి పెళ్లి దాదాపు ఎనిమిది మందిని అరెస్ట్ చేసేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం ఫక్కీర్ గూడకు చెందిన ఓ యువతికి, చౌటుప్పల్ మండలం లింగోజీగూడేనికి చెందిన ఆర్. సతీష్ కు పెళ్లి చూపులు జరిగాయి. కట్నకానుకల విషయంలో తేడాలు రావడంతో ఈ సంబంధం వద్దనుకున్నారు. అయితే ఆ యువతి యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో మార్చి 30వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అక్కడినుంచి సరాసరి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. 

భువనగిరి పోలీస్ స్టేషన్ లో అప్పటికే ఆ యువతి పై మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిద్దరిని భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయి పోలీసులు కుటుంబ సభ్యుల ఎదుట మేమిద్దరం మేజర్లమని, సతీష్ ను నేను ప్రేమిస్తున్నాను అతనితోనే కలిసి ఉంటానని చెప్పడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు.పోలీసులు వారిద్దరిని కారులో అబ్బాయి గ్రామానికి పంపిస్తున్నారనే విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు 8 మంది దారిలో అడ్డంగా ఉండి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా యువతిని వారి వెంట లాక్కెళ్లిపోయారు.దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని వెంబడించి ఆ ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.