తప్పు కమల్‌ది కదా.. శంకర్‌ను అంటారేంటి?

ఇటీవలే రామ్ చరణ్-శంకర్ కలయికలో ఓ సినిమాను ప్రకటించి మెగా అభిమానులను మురిపించాడు దిల్ రాజు. తెలుగులో చాలామంది స్టార్లు శంకర్‌తో సినిమా చేయాలని ఆశపడ్డవాళ్లే. కానీ వాళ్లెవ్వరికీ దొరకని అదృష్టం రామ్ చరణ్ కు దొరికందని అభిమానులు సంబరపడ్డారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారందరూ. కానీ ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు పెద్ద అవాంతరం ఎదురైంది. తమతో చేస్తున్న ‘ఇండియన్-2’ను పక్కన పెట్టి శంకర్ వేరే సినిమా చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ శంకర్ మీద కోర్టుకెక్కింది.

ఈ సినిమా కోసం రూ.230 కోట్ల బడ్జెట్ కేటాయించామని.. అందులో ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చయిందని.. ఈ దశలో సినిమాను పూర్తి చేయకుండా వదిలేసి శంకర్ వేరే సినిమా ఎలా చేస్తారని తమ పిటిషన్లో లైకా ప్రొడక్షన్స్ ప్రశ్నించింది. సినిమాకు సంబంధించి మిగతా రెమ్యూనరేషన్లకు సంబంధించిన మొత్తాన్ని కోర్టుకు సరెండర్ కూడా చేసింది లైకా సంస్థ. ఈ పిటిషన్‌ను పరిశీలించిన చెన్నై కోర్టు.. శంకర్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన సమాధానం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

2018 చివర్లోనే ‘ఇండియన్-2’ పట్టాలెక్కగా.. రకరకాల కారణాలతో సినిమాకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఐతే అవాంతరాల్ని అధిగమించి షూటింగ్ జోరుగా చేస్తుండగా.. సెట్స్‌లో క్రేన్ ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు చనిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత కరోనా వల్ల సినిమా అసలు ముందుకు సాగలేదు. ఈ విరామం తర్వాత కూడా ఇండియన్-2 పున:ప్రారంభం కాలేదు.

సినిమా మొదలైన కొత్తలో మేకప్ సరిపడక.. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చింది కమల్. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో గొడవ పడి ఎంతకీ సినిమాను ముందుకు కదలనివ్వనిదీ కమలే అని ఆరోపణలొచ్చాయి. ఆయనేమో బిగ్ బాస్ షో చేసుకున్నాడు. ‘విక్రమ్’ పేరుతో వేరే సినిమా మొదలుపెట్టాడు. ఎన్నికల్లో బిజీ అయ్యాడు. ఆయన్ని ‘ఇండియన్-2’ పున:ప్రారంభించడానికి ఒప్పించడంలో విఫలమైంది లైకా. దీంతో శంకర్ గత్యంతరం లేక వేరే సినిమా వైపు అడుగులేశాడు. కానీ ఇప్పుడేమో చిత్రంగా నిర్మాణ సంస్థ అతడి మీదే కోర్టుకెక్కింది. మరి ఈ వివాదానికి ఎక్కడ తెరపడుతుందో చూడాలి.