చిన్న సినిమాలకు ఓటీటీలే శరణ్యమా?

కోవిడ్ బ్రేక్ తర్వాత తెలుగు సినిమాల పరిస్థితి చిత్రంగా తయారైంది. కొన్ని సినిమాలేమో వాటి స్థాయికి మించి ఇరగాడేస్తున్నాయి. కొన్ని సినిమాలేమో కనీస స్పందనకు కూడా నోచుకోకుండా వాషౌట్ అయిపోతున్నాయి. మామూలుగానే కొన్నేళ్లుగా చిన్న పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వస్తుండగా.. కోవిడ్ బ్రేక్ తర్వాత వాటి పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతోంది. చాలా మంచి టాక్ తెచ్చుకుంటే తప్ప అవి థియేటర్లలో నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. వాటిలో బిలో యావరేజ్, యావరేజ్, ఎబోవ్ యావరేజ్ లాంటి కేటగిరీలే ఉండట్లేదు. ఏమాత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా వాటి పరిస్థితి దారుణంగా ఉంటోంది. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులకు కూడా వసూళ్లు రాబట్టట్లేదు.

ఈ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఏం ప్రయోజనం అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. దీనికన్నా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే మెరుగైన రేటు వచ్చేదేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. తెలుగు సినిమా రీస్టార్ట్ అయ్యాక గత మూణ్నాలుగు నెలల సంగతే తీసుకుంటే.. బంగారు బుల్లోడు, ఎఫ్సీయూకే, కపటధారి, అక్షర, పవర్ ప్లే, గాలి సంపత్, మోసగాళ్లు, శశి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు. దాదాపుగా ఇవన్నీ జీరో షేర్ సినిమాలనే చెప్పాలి. వీటికి వచ్చిన వసూళ్లు పబ్లిసిటీ, థియేటర్ల రెంట్లు, ఇతర మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోయాయి. వీటిలో చాలా వరకు కరోనా కంటే ముందు, కరోనా టైంలో పూర్తయినవే. కొంత కాలం సినిమాలను ఆపి.. తర్వాత రిలీజ్ చేశారు. ఇంత కష్టపడి రిలీజ్ చేస్తే వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.

థియేటర్లలో రిలీజ్ చేసి అక్కడ పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాక ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా ఆశించినంత పలకక నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. దీని బదులు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే మెరుగైన ధర వచ్చేది. థియేటర్ల స్థాయిలో అక్కడ నెగెటివ్ టాక్ కూడా స్ప్రెడ్ కాదు. శాటిలైట్‌కు కూడా అది కలిసొస్తుంది. ప్రతి సినిమానూ ఓటీటీలో రిలీజ్ చేయాలని కాదు కానీ.. పెద్దగా బజ్ రాని, థియేటర్ల వైపు ప్రేక్షకులను అంతగా ఆకర్షించని, ఔట్ పుట్ అనుకున్నంతగా రాని సినిమాల విషయంలో కొంచెం వాస్తవికంగా ఆలోచించి ఓటీటీలకు ఇచ్చేస్తే నిర్మాతలకు ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు టాలీవుడ్లో బలంగా వినిపిస్తున్నాయి.