రైతుల‌పై ఏపీ మంత్రి ఫైర్‌..

‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణ‌గృహ నిర్మాణ‌శాఖ మంత్రిగా ఉన్న శ్రీరంగ‌నాథ‌రాజు.. ఈ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చేశారా? లేక యాదృచ్ఛికంగా అన్నారా? అంటే.. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా నే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు గుస‌గుస‌గా! గ‌తంలోను, ఇప్పుడు కూడా రాజ‌కీయా లు రంగ‌నాథ ‌రాజుకు కొత్త‌కాదు. ఇప్ప‌టికే ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడిగా జిల్లాలో ప్ర‌చారంలో ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో వివాదంగా మారింది. అది కూడా సొంత‌పార్టీలోనే నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి రంగ‌నాథ‌రాజు మంత్రి అయిన ద‌గ్గ‌ర నుంచి(ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి.. ఆచం ట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు) జిల్లాలో త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలోని నియోజ‌క‌వర్గాల్లో మంత్రి ప‌ట్టు పెంచుకున్నారు. త‌న‌దైన దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇత‌ర నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పైగా మంత్రిగారి అల్లుడు కూడా జిల్లాలో హ‌వా చూపిస్తున్నార‌నే విష‌యం దాచినా దాగ‌డం లేదు. ఈ ప‌రిస్థితి జిల్లాలోనే కాకుండా పార్టీలోనూ ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్లు.. మంత్రిపై ఫిర్యాదులు చేశార‌ని.. వార్త‌లు గుప్పుమంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌ల‌ను దారిమ‌ళ్లించేందుకు మంత్రిగారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. రైతుల విష‌యం సెంటిమెంటుతో కూడిన వ్య‌వ‌హారం కావ‌డంతో ఆయ‌న ఈ విష‌యంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారాన్ని ప‌క్కదారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించార‌ని జిల్లాకు చెందిన సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను… అంటే వచ్చి దున్నుతాడు. బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే… ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. దీంతో ఒక్క‌సారిగా మంత్రిగారిపై ఉన్న ఇత‌ర విష‌యాలు ప‌క్క‌దారి ప‌ట్టి..ఈ విష‌య‌మే హైలెంట్ అయింది. అయితే.. దీనిపై వెంట‌నే స‌మాధానం ఇచ్చిన మంత్రి.. తమ ప్రాంతంలో ఎక్కువగా వరి వ్యవసాయం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందటం లేదన్నారు. భూ యజమానులు పథకాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. తాను రైతు బిడ్డను కావటంతో తొందరపాటులో మాట్లాడానని వివరణ ఇచ్చారు. రైతులను కించపరిచే ఉద్దేశం లేదని రంగనాథరాజు ప్రకటించారు. అయితే.. ఇదంతా కూడా ఒక త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు చేసిన మ‌రో త‌ప్ప‌ని గుస‌గుస‌లాడుతున్నారు వైసీపీ సీనియ‌ర్లు.