పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్

ఎన్నికలంటేనే చిత్ర, విచిత్రమైన పరిస్దితులుంటాయి. భారీ పోలింగ్ జరిగినా సమస్యే, పోలింగ్ చాలా తక్కువగా జరిగినా సమస్యే. మొదటి దశ పోలింగ్ తర్వాత పశ్చిమబెంగాల్లో రాజకీయపార్టీలన్నింటిదీ ఇదే పరిస్ధితిగా తయారైంది. శనివారం బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిదశ పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం అందే సమయానికి దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మామూలు పరిస్ధితుల్లో అయితే జరిగిన పోలింగ్ బాగా ఎక్కువనే చెప్పాలి.

ఎందుకంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరా హోరీగా జరుగుతున్న ప్రచారంలో గొడవలు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా జరిగంది. ఇప్పటికే అక్కడక్కడ చెదురుమదురు గొడవలు కూడా జరిగాయి. దాంతో ముందుజాగ్రత్తగా ప్రతి పోలింగ్ స్టేషన్లోను భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందరు అనుమానించినట్లే అక్కడక్కడ గొడవలు కూడా జరిగాయి. అయినా 80 శాతం పోలింగ్ జరగటమే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే పోలింగ్ ఎక్కువ జరిగినా తక్కువ జరిగినా రాజకీయ పండితులు రెండు రకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మొదటిదేమో పోలింగ్ ఎక్కువ జరిగితే అధికారపార్టీ మీద వ్యతిరేకత కారణంగానే జనాలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొంటారని.

ఇక రెండో సిద్ధాంతమేమో పోలింగ్ గనుక బాగా తక్కువగా జరిగితే ప్రతిపక్షాల మీద జనాలకు పెద్దగా ఆశలు లేనికారణంగానే ఓటింగ్ లో పాల్గొనేందుకు జనాలు ఆసక్తి చూపలేదని అంటుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మమతబెనర్జీ మీద జనాల్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు. అందుకనే ప్రీపోల్ సర్వేల్లో ఎక్కువ శాతం మళ్ళీ మమతకే ఓట్లేస్తామని జనాలు చెప్పారు.

ప్రీపోల్ సర్వేల నేపధ్యంలోనే మొదటి దశలో 80 శాతం పోలింగ్ నమోదవ్వటంతో ఏ పార్టీకి ఆపార్టీ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. అధికారిక ప్రకటన వస్తేకానీ అసలైన పోలింగ్ ఎంతనేది నిర్ధారణకాదు. మరి మొదటి దశలో జనాలు ఇంతగా పోటెత్తి ఓటింగ్ లో పాల్గొనేందుకు రావటానికి అసలైన కారణం ఏమి అయ్యుంటుందో అర్ధంకాక పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.