‘లెజెండ్’ ఇంటర్వెల్ బ్లాక్‌ను మించేలా..

నందమూరి బాలకృష్ణ కెరీర్ డౌన్ అయినపుడల్లా అభిమానుల చూపు బోయపాటి శ్రీను మీదే ఉంటోంది. దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్టు లేక ఇబ్బంది పడ్డ ఆయన్ని ‘సింహా’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఈ దర్శకుడే. ఆ తర్వాత మళ్లీ కెరీర్ ఒడుదొడుకులకు లోనైన పరిస్థితుల్లో ‘లెజెండ్’తో మరోసారి బాలయ్యను పైకి లేపాడు బోయపాటి. ఆ తర్వాత షరా మామూలే. మళ్లీ ఫ్లాపులతో అల్లాడిపోయాడు నందమూరి హీరో.

ఈసారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ‘యన్.టి.ఆర్’ రెండు సినిమాలు, రూలర్ ఒకదాన్ని మించి ఒకటి పరాభవం చవిచూశాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ స్థితిలో బోయపాటితో బాలయ్య మళ్లీ జట్టు కట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరోకు ఆ దర్శకుడు మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వడం గ్యారెంటీ అన్న ధీమాతో ఉన్నారు. టీజర్, ఫస్ట్ లుక్ చూస్తే వారి అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందనిపించింది.

బాలయ్యతో సినిమా అంటే మాస్ ప్రేక్షకులను, అభిమానులను దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటాడు బోయపాటి. బాలయ్యతో ఇంతకుముందు చేసిన రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ బ్లాక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించడం.. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం తెలిసిందే. ముఖ్యంగా ‘లెజెండ్’లో అయితే పెద్ద బాలయ్య రంగప్రవేశం చేసే సన్నివేశం థియేటర్లను హోరెత్తిపోయేలా చేసింది. టాలీవుడ్ మాస్ సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్స్‌గా అది గుర్తింపు సాధించింది.

ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న కొత్త సినిమాలోనూ ఒక పేలిపోయే ఇంటర్వెల్ బ్లాక్ ప్లాన్ చేశాడట బోయపాటి. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారట బాలయ్య-బోయపాటి. భారీ ఖర్చుతో ఈ సీక్వెన్స్ తీశారని.. ఇది కచ్చితంగా సినిమాలో హైలైట్ అవుతుందని.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.