జ‌గ‌న్‌కు గ‌ట్టి దెబ్బ‌.. మూడుపై పీటముడి..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్ప‌టికే ముహూర్తం ఫిక్స్ చేసుకుని.. ఆర్భాటంగా విశాఖ‌కు వెళ్లిపోదామ‌నుకున్న జ‌గ‌న్ వ్యూహానికి హైకోర్టు రూపంలో గ‌ట్టి శ‌రాఘాత‌మే త‌గిలింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లు ఓకే చెప్పార‌ని.. అందుకే త‌మ‌కు అన్ని ఎన్నిక‌ల్లోనూ సానుకూలంగా ఫ‌లితం ఇచ్చార‌ని ఊరూ వాడా ప్ర‌చారం చేసుకుంటున్న వైసీపీ నేత‌ల‌కు తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యంతో గొంతులో వెల‌క్కాయ‌ప‌డిన‌ట్టు అయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఆలోచ‌న సంత‌రించుకున్న అమ‌రావ‌తిని ఆనాడు ఒప్పుకొని త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చి.. తొండి చేసిన జ‌గ‌న్‌పై రైత‌న్న‌లు ఆగ్ర‌హంతో ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. ఇంత‌లోనే చాప‌కింద నీరు మాదిరిగా మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో కోర్టులో పిటిష‌న్లు విచార‌ణ‌కు రావ‌డంతో గ‌తంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రించిన జేకే మ‌హేశ్వ‌రి ఈ పిటిష‌న్ల‌పై తీర్పు వెలువ‌రించే వ‌ర‌కు మూడు ప్ర‌య‌త్నాలు ఆపాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ క్ర‌మంలో తాజాగా శుక్ర‌వారం హైకోర్టులో ఈ పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో త‌మ‌కు తీర్పు అనుకూలంగా వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కూడా బావించారు.

అయితే.. రైతులు, ఇతరులు వేసిన పిటిషన్‌పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. పిటిషన్‌లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సీజే ఏకే గోస్వామి, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. గతంలో ఈ కేసు సంబంధించి ఇటు రైతుల నుంచి అటు ప్రభుత్వం నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో అప్పటి చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది.

అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్ధమైంది. ఈ కేసు విచారణ రెండు, మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంతో జ‌గ‌న్‌కు తీవ్ర శ‌రాఘాతం త‌గిలింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు అంటే రెండు మూడు మాసాల వ‌ర‌కు జ‌గ‌న్ ఇక‌, మూడు ప్ర‌య‌త్నాల‌కు బ్రేకులు వేసుకోవాల్సిందేన‌ని అంటున్నారు నిపుణులు.