షారుఖ్‌ ఖాన్‌కు వంద కోట్లా?


వరుస ఫ్లాపులతో చాలా ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నాడు షారుఖ్ ఖాన్. సినిమాలు ఫ్లాపవడం ఒక బాధ అయితే.. క్రమ క్రమంగా ఆయన మార్కెట్ కుచించుకుపోతుండటం, సినిమాల ఓపెనింగ్స్ అంతకంతకూ తగ్గిపోతుతండటం మరింత ఆందోళన రేకెత్తించే విషయం. షారుఖ్ నుంచి చివరగా వచ్చిన ‘జీరో’ సినిమా అయితే ఇండియాలో వంద కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అలాంటిది షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన కొత్త చిత్రానికి రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం అంటోంది బాలీవుడ్ మీడియా.

‘జీరో’ తర్వాత రెండేళ్లకు పైగా విరామం తీసుకుని గత ఏడాదే ‘పఠాన్’ అనే సినిమా మొదలు పెట్టాడు షారుఖ్. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక బేనర్లో ‘వార్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. షారుఖ్ గత సినిమాల ప్రభావం దీని మీద ఎంతమాత్రం కనిపించడం లేదు.

మేకింగ్ దశలో ఉండగానే ‘పఠాన్’కు భారీగా హైప్ వచ్చేసింది. భారీగా బిజినెస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాతో షారుఖ్ మళ్లీ ఫామ్ అందుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. సినిమాకు తాము అంచనా వేసిందానికంటే ఎక్కువ బిజినెస్ ఆఫర్లు రావడంతో షారుఖ్‌కు ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం కింద ఇస్తున్నాడట నిర్మాత ఆదిత్య చోప్రా.

అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాభాల్లో వాటా రూపంలో ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగానే ఆర్జిస్తారని అంటుంటారు కానీ.. ఇలా పారితోషకం కింద రూ.100 కోట్లు పుచ్చుకుంటున్న తొలి ఇండియన్ హీరో షారుఖే అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వరుస ఫ్లాపుల వల్ల వెనుకబడ్డాడు కానీ.. ఫాలోయింగ్, మార్కెట్ పరంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో షారుఖ్ ఒకడు. మంచి సినిమా పడితే అతను పూర్వ వైభవం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఆ వైభవం ‘పఠాన్’తో వస్తుందేమో చూడాలి.