టీడీపీని రాబిన్ ఒడ్డున పడేస్తాడా ?

ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే జగన్ కు అన్ని సీట్లు వచ్చింది.

సరే సక్సెస్ కు వాటాదారులు చాలామందే ఉంటారు కదా. అలాగే ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కేసింది. జగన్ లో దమ్ము లేకపోతే వందమంది ప్రశాంత్ లైనా ఏమీ చేయలేరు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఒకపుడు ప్రశాంత్ టీములో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనతోనే చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకుని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత అప్పగించారు.

రాబిన్ ఇంతకాలంగా పార్టీ బలోపేతానికి ఏమి సలహాలిచ్చారో ఎవరికీ తెలీదు. అయితే తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రాబిన్ వ్యూహాలేమిటో తేలిపోతుంది. నిజానికి ఉపఎన్నికలో గెలుపన్నది వైసీపీ నల్లేరుమీద బండినడకే. కాకపోతే టీడీపీ ఎంత గట్టిగా పోరాడింది అనేదే గమనించాలి. ఆ పోరాటంలో పార్టీ బలమెంత ? రాబిన్ వ్యూహాలేమిటి ? అనేదే కీలకమవుతుంది.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.9 లక్షల ఓట్లొస్తే అదే పదివేలు. నిజానికి టీడీపీ పరువు నిలబడితే ఇందులో వ్యూహకర్త పనితనం కూడా ఉందని అనుకోవాలి. లేకపోతే ఎవరు కూడా చేసేదేమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు+టీడీపీ నేతలు నికార్సయిన పోరాటాలు చేస్తేనే జనాల అభిమానం పొందగలరు కానీ రాబిన్ శర్మ లాంటి వ్యూహకర్తల వల్లే జనాభిప్రాయం పొందటం సాధ్యంకాదు.