‘బాహుబలి’ని బీట్ చేసిన ‘జాతిరత్నాలు’

జాతిరత్నాలు లాంటి చిన్న సినిమా ‘బాహుబలి’ని బీట్ చేయడమేంటి… అది ఏ రకంగా అని సందేహాలు కలుగుతున్నాయా? కానీ ఇది నిజం. హైదరాబాద్‌లో సినిమా థియేటర్ల హబ్‌గా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తర్వాతి స్థానంలో నిలిచింది.

2017 ఏప్రిల్లో రిలీజైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఆల్ టైం రికార్డు. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో రూ.40.83 లక్షల గ్రాస్‌లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ దానికి చేరువగా వచ్చింది. ఆ చిత్రం రూ.40.76 లక్షలు కొల్లగొట్టింది. ఇప్పుడు దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్‌తో మూడో స్థానానికి చేరుకుంది. ‘బాహుబలి’ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదో స్థానంలో ‘మహర్షి’ చిత్రం ఉంది. ఆ సినిమా రూ.32 లక్షలు కలెక్ట్ చేసింది.

ఐతే ‘బాహుబలి-2’తో పోలిస్తే టాప్-5లో అన్ని సినిమాలకూ టికెట్ల రేట్లు పెరిగాయి. 50 శాతం ధరలు పెంచుకోవడంతో వీటి గ్రాస్ పెరిగింది. కాబట్టి నిజంగా చూస్తే ‘బాహుబలి-2’ను ఈ సినిమాలేవీ కొట్టినట్లు కాదు. ఐతే టాప్-5లో ఉన్న మిగతా చిత్రాలన్నీ పెద్ద పెద్ద హీరోలు నటించినవి. భారీ స్థాయివి. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా వాటికి దీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ రకంగా ‘జాతిరత్నాలు’ గ్రేట్ ఫీట్ సాధించినట్లే.