బన్నీ-ప్రశాంత్ నీల్.. పక్కా


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇండియాలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ హీరోలందరికీ తమ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రశాంత్‌తో సినిమా చేయాలని ఉంది. ‘కేజీఎఫ్’ చూశాక ఏ మాస్ హీరోకైనా ప్రశాంత్‌తో సినిమా చేయాలన్న కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మరి.

అతడికి తన సొంత పరిశ్రమ నుంచే కాక వివిధ ఇండస్ట్రీల నుంచి మంచి ఆఫర్లు ఉన్నప్పటికీ.. టాలీవుడ్ మీదే ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు మరో టాలీవుడ్ టాప్ స్టార్‌తో ప్రశాంత్ సినిమా ఖరారైనట్లే కనిపిస్తోంది. బన్నీ వాసు మాటల ప్రకారం చూస్తే.. అల్లు అర్జున్‌తోనూ ప్రశాంత్ కచ్చితంగా ఓ సినిమా చేయబోతున్నట్లే.

తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన బన్నీ వాసు.. బన్నీ-ప్రశాంత్ కాంబినేషన్ గురించి మాట్లాడాడు. ‘‘ప్రశాంత్‌ నీల్‌‌కు, అల్లు అరవింద్‌ గారికి మంచి రిలేషన్‌ ఉంది. మా గీతా ఆర్ట్స్‌ సంస్థలో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. అది బన్నీతో అయితే బావుంటుందని ఆయనకూ, మాకూ ఉంది. కొన్ని పాయింట్లు చర్చల దశలో ఉన్నాయి. ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. కానీ, బన్నీ-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా ఉంటుంది’’ అని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవలే ప్రశాంత్.. గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చి అరవింద్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు ఇంత ధీమాగా చెబుతున్నాడంటే.. సలార్, ఎన్టీఆర్ సినిమా అయ్యాక ప్రశాంత్.. బన్నీతో జత కట్టడం లాంఛనమే కావచ్చు. ఈలోపు బన్నీ ‘పుష్ప’తో పాటు కొరటాల శివ చిత్రాన్ని పూర్తి చేస్తాడు.