తెలంగాణ‌లో క‌రోనా.. స‌డెన్ జంప్ ఎందుకు?

జ‌నాలు నెమ్మ‌దిగా క‌రోనాను లైట్ తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చేస్తోంద‌ని బ‌య‌ట ప‌రిణామాలు చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంత‌కుముందులా భ‌య‌ప‌డ‌టం మానేసి జ‌నాలు స్వేచ్ఛ‌గా తిరిగేస్తున్నారు. పోలీసులు కూడా మ‌రీ స్ట్రిక్టుగా ఏమీ క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కొన్ని రోజులుగా క‌రోనా కేసులు త‌గ్గిపోవ‌డంతో జ‌నాల్లో తేలిక భావం వ‌చ్చిన‌ట్లు అనిపిస్తోంది.

గ‌త ప‌ది రోజుల్లో వ‌చ్చిన కేసుల‌న్నీ క‌లిపినా వంద లోపే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ద‌శ‌లో రోజు మొత్తంలో రెండు కేసులే బ‌య‌ట‌ప‌డ్డాయి. శుక్రవారం న‌మోదైన కేసులు ప‌ది. దీంతో తెలంగాణ‌లో క‌రోనా క‌ర్వ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని.. త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు వ‌చ్చేస్తాయ‌నే ఆశ‌తో ఉన్నారు జ‌నాలు. ఐతే శ‌నివారం ఉన్న‌ట్లుండి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

ఒక రోజు వ్య‌వ‌ధిలో తెలంగాణ‌లో 31 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. గ‌త ప‌ది రోజుల్లో అత్య‌ధికంగా కేసులు బ‌య‌ట‌ప‌డ్డ‌ది ఈ రోజే. మ‌రి ఈ స‌డెన్ జంప్‌కు కార‌ణ‌మేంట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌ద్యం దుకాణాలు బుధ‌వారం పునఃప్రారంభం కావ‌డంతో జ‌నాలు పెద్ద ఎత్తున బ‌య‌టికి వ‌చ్చారు. ఉన్నంత‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. మందు బాబుల అత్యుత్సాహం క‌రోనా వ్యాప్తి పెర‌గ‌డానికి కార‌ణ‌మై ఉంటుంద‌ని.. ఈ నేప‌థ్యంలోనే కేసుల సంఖ్య పెరిగింద‌ని.. మున్ముందు ఇంకా పెరగొచ్చ‌ని అంటున్నారు.

ఈ రోజు కేసుల సంఖ్య బ‌య‌టికి రాగానే నింద మందు బాబుల మీదికి వెళ్తోంది. మ‌ద్యం దుకాణాలు బంద్ చేయాల‌న్న డిమాండ్ మ‌ళ్లీ పైకి లేచింది. పొరుగున ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 43 క‌రోనా పాజిట‌వ్ కేసులు తేలిన‌ట్లు శ‌నివారం ఉద‌యం బులెటిన్ ఇచ్చారు. ఐతే తెలంగాణ‌లో క‌రోనా టెస్టులు చాలా త‌క్కువ స్థాయిలో చేస్తున్నారని, టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుంద‌ని నిపుణులంటున్నారు.