బీజేపీకి సీన్ అర్ధమైపోయిందా ?

తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీన్ ఏమిటో అర్ధమైపోయినట్లుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులున్నాయి. వీటిల్లో 490 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. వీటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1269 చోట్ల అధికార వైసీపీనే గెలిచింది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధులు 45 వార్డుల్లో గెలిచారు.

ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 265 వార్డుల్లో గెలిచింది. మరో 2 చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్ధులు గెలిచారు. జనసేన 18 వార్డుల్లో గెలిచింది. మరి దాని మిత్రపక్షమైన బీజేపీ ఎన్ని వార్డుల్లో గెలిచింది ? ఎన్నింటిలో అంటే కేవలం 7 వార్డుల్లో మాత్రమే. సీపీఐ 3, కాంగ్రెస్1, సీపీఎం 1 వార్డులో గెలిచాయి. స్వతంత్రులు 21 వార్డుల్లో గెలవటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు తమ స్ధాయికి మించి మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని పదే పదే చెబుతున్నారు. నరేంద్రమోడి సారధ్యంలో బీజేపీ బలపడుతోందని గంభీరంగా ప్రకటనలు చేస్తున్నారు. హోలు మొత్తం మీద చూస్తే గెలిచింది 7 వార్డుల్లో. అంటే బీజేపీ స్ధాయి ఏమిటనేది స్పష్టమైపోయింది.

కమలంపార్టీకి మరీ ఇంత ఘోరమైన పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే ప్రదాన కారణమని అర్ధమవుతోంది. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాల విషయంలో చాలా నెగిటివ్ గా వెళుతున్నారు. విభజన చట్టంలో చెప్పిన హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన చట్టాలను తుంగలో తొక్కేయటమే కాకుండా విశాఖ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.

నిజానికి బీజేపీ మొదటి నుండి కూడా బలమైన పార్టీ కాదు. ఏదో దేశం మొత్తంమీద బీజేపీ గాలుంటేనే రాష్ట్రంలో కమలంపార్టీకి నాలుగు సీట్లొస్తాయి. లేకపోతే చతికిల పడిపోతుంది. 2014లో నాలుగు అసెంబ్లీలను, రెండు ఎంపి సీట్లలో గెలిచిందంటే మోడి వేవ్ లోనే. అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి గుండుసున్నా. అదే తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీటైంది. రేపటి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా ఇదే రిజల్టు వస్తుందనటంలో సందేహమే లేదు.