రీల్ విలన్.. ఇప్పుడెంత దారుణ స్థితిలో ఉన్నారంటే?

వెండి తెరపై ప్రతినాయక పాత్రల్లో చెలరేగిపోయిన నటుల్లోఒకరు పొన్నంబళం. భారీ కాయంతో పాటు.. అతడి విలనీ భయంకరంగా ఉండేది. రీల్ పై శక్తివంతమైన విలనీ క్యారెక్టర్లు చేసిన అతడు ఇప్పుడు ప్రాణాల్ని నిలుపుకోవటం కోసం పోరాడుతున్నాడు. తనకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతూ.. తనను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు. తాజాగా తాను ఉన్న పరిస్థితి గురించి వివరాల్ని ఒక ప్రకటన ద్వారా మీడియాకు అందించాడు.

తెలుగు.. తమిళంతో పాటు పలు భాషా చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్ని పోషించిన పొన్నంబళం ఇప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అతడి కిడ్నీలు పాడైపోవటంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కిడ్నీ మార్పిడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నారు.

ఐదేళ్లుగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. ప్రాణాల్ని నిలుపుకోవటానికి పోరాడుతున్నానని.. ఆదుకోవాలన్నారు. తనకు కిడ్నీ దానం చేయటానికి తన సోదరి కొడుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. అయితే.. ఈ శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బులు తన దగ్గర లేవని.. తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

తమిళ సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ.. ఆదుకోవాలని కోరారు. గతంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పడు రజీన..కమల్.. రాధిక శరత్ కుమార్.. ధాను ధనుష్.. రవికుమార్.. లారెన్స్ లాంటి ప్రముఖులు సాయం చేశారన్నారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆర్థిక సాయం అవసరమైందని పేర్కొన్నాడు. మరి.. పొన్నాంబళం విన్నపానికి తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.