పవన్-షర్మిల మధ్యే పోటీనా ?

వినటానికి విచిత్రంగా ఉన్న రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారమైతే ఇదే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చాలా సంవత్సరాలే అయినా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రియాశీలం కాలేదు. రాష్ట్రకమిటిని కూడా పూర్తిస్ధాయిలో నియమించకపోవటమే ఇందుకు నిదర్శనం. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటి అనేదాన్ని వేసేసి రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు.

ఇక షర్మిల విషయానికి వస్తే తొందరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే ముందుగా రాష్ట్ర కమిటి ఏర్పాటును కూడా నియమించేస్తారనే ప్రచారం జరుగుతోంది. తర్వాత వీలైనంత తొందరలో జిల్లాల కమిటీల నియామకం కూడా జరుగుతుందని లోటస్ పాండ్ ముఖ్యులు చెబుతున్నారట. షర్మిల ప్రధాన దృష్టంతా సీమాంధ్ర సెటిలర్లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానుల మీదే ఉంది. ఇందులో కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, జీహెచ్ఎంసీ పరిధిపైనే ఉంది.

ఇదే పద్దతిలో పవన్ కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. తొందరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పై జిల్లాల్లో కమిటిలను మాత్రం నియమించారు. ఇటు పవన్ అటు షర్మిల ఆలోచనలు చూస్తుంటే ఇద్దరు కూడా పైన చెప్పిన జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. చూడబోతుంటే తెలంగాణాలో రేపటి ఎన్నికల్లో పవన్-షర్మిల మధ్య ప్రధాన పోటీ ఉండేట్లుంది.

పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ లేదా కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి పవన్ వెనకాడుతున్న విషయం స్పష్టమైపోతోంది. కానీ ఇంకా పార్టీ పెట్టకుండానే షర్మిల మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు మొదలుపెట్టేశారు. చివరకు ఫాం హౌస్ రాజకీయాల గురించి కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి సీమాంధ్రలే లక్ష్యంగా ఇద్దరు పోటీపడితే జనాలు ఎవరిని ఆధరిస్తారో చూడాలి.