‘జాతిరత్నాలు’ డిస్ట్రిబ్యూటర్ల బాధ

సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అదిరిపోయే ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఇంకేంటి ‘జాతిరత్నాలు’ డిస్ట్రిబ్యూటర్ల బాధ అంటారా? ఈ సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి సొమ్ము చేసుకోకపోవడమే వారిని ఇప్పుడు బాధ పెడుతున్న విషయం. మహాశివరాత్రికి ఒకేసారి మూడు సినిమాల విడుదలకు ముహూర్తం కురదడంతో థియేటర్ల పంపకం చాలా రోజుల ముందే జరిగిపోయింది. నెల కిందటే థియేటర్ల అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.

అప్పటికి ఎక్కువ అంచనాలు ‘శ్రీకారం’ మీదే ఉన్నాయి. ఎంతైనా అది శర్వానంద్ హీరోగా నటించిన సినిమా. పెద్ద బేనర్లో తెరకెక్కింది. బడ్జెట్ కూడా ఎక్కువే. దానికే థియేటర్ల కేటాయింపులో అగ్ర తాంబూలం దక్కింది. పెద్ద నగరాల్లో ‘జాతిరత్నాలు’కు స్క్రీన్లు బాగానే దక్కాయి కానీ.. బి, సి సెంటర్లలో ‘శ్రీకారం’కే ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ‘గాలి సంపత్’ వీటితో పోలిస్తే తక్కువ అంచనాలున్న సినిమా. అయినా సరే.. దానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లు ఇచ్చారు. అనిల్ రావిపూడి అన్నీ తానై వ్యవహరించిన సినిమా కావడంతో దీని వెనుక దిల్ రాజు నిలబడ్డారు. అలాగే ‘మజిలీ’ నిర్మాతలు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీంతో ఆ సినిమా స్థాయికి మించి స్క్రీన్లు దక్కాయి.

ఐతే రిలీజ్ ముంగిట ‘జాతిరత్నాలు’కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. ‘శ్రీకారం’ సైతం దానికి పోటీ ఇవ్వలేకపోయింది. ‘గాలి సంపత్’ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మూడు చిత్రాల మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే టాక్ కూడా వచ్చింది. ‘జాతిరత్నాలు’ టాప్‌లో నిలిచింది. ‘శ్రీకారం’ తర్వాతి స్థానం దక్కించుకుంది. ‘గాలి సంపత్’కు ఆశించిన టాక్ రాలేదు. దీంతో రెండో రోజు ‘జాతిరత్నాలు’కు ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి. ‘శ్రీకారం’ పరిస్థితి పర్వాలేదు. కానీ ‘గాలి సంపత్’ వెలవెలబోతోంది. ‘జాతిరత్నాలు’కు ఇప్పుడు అత్యవసరంగా సగం థియేటర్లు పెంచినా మంచి ఆక్యుపెన్సీ వచ్చేలా ఉంది. కానీ ముందు జరిగిన ఒప్పందాల వల్ల ఏమీ చేయలేని పరిస్థితి. డిమాండ్ ఉన్నా కూడా థియేటర్లు లేవు. దీని ఓవర్ ఫ్లోస్ మిగతా రెండు సినిమాలకు కలిసొస్తుండటం విశేషం.