బ్యాక్ సీట్లకే పరిమితమైపోయిన బీజేపీ, కాంగ్రెస్

మొత్తానికి రెండు జాతీయ పార్టీల పరిస్ధితి చాలా దయనీయంగా తయారైంది. కూటముల్లోని పెద్దన్నలు ఇచ్చిన సీట్లను తీసుకుని పోటీ చేయటం తప్ప వేరే దిక్కేలేకుండా పోయింది. ఇదంతా ఏ రాష్ట్రంలో ? జాతీయ పార్టీలేవి ? అనే విషయాలపై ఇప్పటికే ఓ క్లారిటి వచ్చేసుంటుంది. అవును తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్ధితి గురించే చెప్పకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్దితి అంటే గతకాలపు వైభవాలు కాబట్టి తాజా పరిస్ధితి ఇలాగైపోయిందని సరిపెట్టుకోవచ్చు.

కానీ బీజేపీ పరిస్ధితి అలాకాదే. గడచిన ఏడేళ్ళుగా కేంద్రంలో బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. దేశంలో మోడి కత్తికి ఎదురన్నదే లేకుండా పోయింది. జయలలిత మరణం తర్వాత తెరవెనుక నుండి తమిళనాడులో చక్రం తిప్పుతున్నది బీజేపీనే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పార్టీకి కూడా ఇంతటి దయనీయ పరిస్దితి ఏమిటో ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పోటీ చేయబోతున్న బీజేపీ 20 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. బీజేపీ ఇంకా ఎక్కువ సీట్లు అడిగినా అన్నాడీఎంకే చీఫ్, సీఎం పళనిస్వామి స్పందించలేదట. అసలు ఇప్పుడిచ్చిన సీట్లే చాలా ఎక్కువన్నట్లుగా మాట్లాడటంతో బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోయారట. దాంతో ఇచ్చిన సీట్లను మాట్లాడకుండా తీసుకుని పోటీకి రెడీ అయిపోతున్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయం ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదు.

ఇక డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ 25 సీట్లలో పోటీ చేస్తోంది. నిజానికి కాంగ్రెస్ నేతలు 30 సీట్లకు మించే డిమాండ్ చేసింది. అయితే ఇన్ని సీట్లిచ్చిందే ఎక్కువని డీఎంకే చీఫ్ స్టాలిన్ తెగేసి చెప్పారట. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో 43 సీట్లు కేటాయించి తప్పు చేశామని చెప్పారట. కాబట్టి ఈసారి ఆ తప్పు చేయదలచుకోలేదని స్పష్టంగా చెప్పారట. సరే కూటముల్లోని మిగిలిన పార్టీల పోటీ విషయం ఎలాగున్నా రెండు జాతీయ పార్టీలు మాత్రం వెనక సీట్లకే పరిమితమైపోయిన విషయం అర్ధమైపోతోంది.