తిరుపతి మీద ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనను బీజేపీ వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే స్ధానిక బీజేపీ నేతల మనోభావలతోను, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో ఏమాత్రం సబంధం లేకుండా, పట్టించుకోకుండా తనిష్టం వచ్చిన నిర్ణయాలను కేంద్రం తీసేసుకుంటోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఇందులో భాగమే. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎంత ప్రయత్నించినా ఈ విషయమై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు.

ఒకవైపు ప్రైవీటకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు+స్ధానికులు ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయపార్టీలు కూడా కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే విషయాన్ని, క్షేత్రస్ధాయిలో జనాల మనోభావాలను కేంద్రంలోని పెద్దలకు తెలియజేయటానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో ఎంత ప్రయత్నించినా ఎవరు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోగా తాజాగా ప్రైవేటీకరణ విషయంలో మరింత జోరు పెంచినట్లు ప్రకటించింది.

రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రం వైఖరి చూసిన తర్వాత ఏమి మాట్లాడాలో బీజేపీ నేతలకు దిక్కుతోచటం లేదు. దాంతో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది. విశాఖ ఉక్కు నిర్ణయ ప్రభావం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై పడుతుందని అర్ధమైనట్లుంది. అందుకనే ఇపుడు బీజేపీ నేతలు అసలా ఊసే ఎత్తటంలేదు.

మొన్నటి వరకు తిరుపతిలో పోటీ చేయబోయేది తామే అంటు మిత్రపక్షం జనసేన నేతల దగ్గర తొడలు కొట్టిన కమలనాదులు ఇపుడా విషయాన్నే ప్రస్తావించటం లేదని సమాచారం. దాంతో ఇపుడు భారమంతా మొత్తం జనసేనపైనే పడేట్లుంది. పోటీ చేయబోయేదీ జనసేన అభ్యర్ధే, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కల్యాణ్ పైనే ఉందని పరోక్షంగా బీజేపీ నేతలు చెబుతున్నారట.

ఒకవైపు ఏపి విషయంలో పూర్తి నిర్లక్ష్యం చూపుతు, ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న కేంద్రం నిర్ణయంపై జనాలు మండిపోతున్నారు. ఈ పరిస్దితుల్లో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం ఎలాగ ? అన్నదే ఇపుడు జనసేనకు అర్ధం కావటంలేదు. గెలుపు అవకాశం ఏమాత్రం లేదని అర్ధమైపోయిన తర్వాతే బీజేపీ నేతలు పోటీ విషయంలో వెనకాడుతున్నారన్నది వాస్తవం. మరి ఈ విషయంలో మిత్రపక్షాలు ఏమి చేస్తాయన్నది ఆసక్తిగా మారింది.