ఇబ్బంది పడిపోయిన బీజేపీ అధ్యక్షుడు

బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇపుడు విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గడచిన నెల రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఉక్కు ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అన్నీ పార్టీలు తమ అభ్యర్ధుల తరపున చేస్తున్న ప్రచారంలో ప్రధానంగా విశాఖ ఉక్కునే టార్గెట్ చేస్తున్నారు. అయితే బీజేపీతో పాటు దాని మిత్రపక్షం జనసేన నేతలు మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఆదివారం బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసిన సోము వీర్రాజు ఎక్కడా విశాఖ ఉక్కు విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మిగిలిన రాజకీయపార్టీల నేతలు తమ ప్రచారాన్ని పూర్తి చేయటంలేదు.

కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో చాలా స్పీడుగా ముందుకెళుతోంది. ఇదే విషయమై రాష్ట్రంలోని పార్టీలపై ఒకపుడు సోము వీర్రాజు అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరిస్తున్నపుడు ఎప్పుడు ప్రకటించలేదన్నారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ఏమి మాట్లాడాలో రాష్ట్ర బీజేపీ నేతలకు దిక్కుతోచలేదు.

ఇలాంటి నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో వీర్రాజు ప్రచారానికి దిగారు. అందులోను విశాఖపట్నంలోనే ప్రచారానికి దిగటంతో ప్రజలు ఉక్కు ప్రైవేటీకరణపై నేరుగానే వీర్రాజును నిలదీశారు. దానికి సమాధానం చెప్పలేని అధ్యక్షుడు విశాఖలో బీజేపీ ఎంత బలంగా ఉంది, గతంలో ఎంపిలుగా బీజేపీ నేతలు గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తు మాట్లాడారు. బీజేపీ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జనాలు కమలంపార్టీని ఆదరించాలని పదే పదే కోరుతు తమ ప్రచారాన్ని ముగించారు. ప్రజల ఆలోచనలతో బీజేపీ పరిస్దితేమిటి అన్నది వీర్రాజకు తెలిసిపోయే ఉంటుంది.