సమంతకు జోడీగా ఇంకెవరూ దొరకలేదా?


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వెండితెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. చివరగా ‘జాను’ సినిమాలో చూశాం ఆమెను. ఆ సినిమా వచ్చింది వెళ్లింది తెలియనట్లుగా జరిగిపోయింది. ఒకప్పట్లా స్టార్ల సరసన నటించడానికి సమంత ముందుకు రావట్లేదో లేక ఆమేనే అలాంటి పాత్రలకు ఒప్పుకోవట్లేదో తెలియలేదు కానీ.. సమంత కెరీర్లో ‘జాను’ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసి ఆమె ఇక మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.

ఇలాంటి తరుణంలోనే సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ అనే పురాణ గాథను తెరకెక్కించడానికి ముందుకొచ్చాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. ఐతే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా రోజులవుతోంది కానీ.. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. సినిమాలో ముఖ్య పాత్రధారుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా శకుంతల పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరు చేస్తారనే ఆసక్తితో అందరూ ఉన్నారు.

సమంతకు దీటుగా ఓ పేరున్న నటుడినే దుష్యంతుడి పాత్రకు ఎంచుకుంటారని అంతా భావించారు. కానీ గుణశేఖర్ ఈ విషయంలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. తెలుగు వాళ్లకు పరిచయం లేని మలయాళ నటుడిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నటుడి పేరు.. దేవ్ మోహన్. మలయాళంలో కూడా అతను పెద్ద స్టారేమీ కాదు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నాడు. చేసిన సినిమా ఒక్కటే. అలాంటి నటుడిని సమంతకు జోడీగా ఇలాంటి భారీ చిత్రానికి ఎంచుకున్నారన్న వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో సమంతనే హైలైట్ చేయాలని భావించి ఉండొచ్చు. ఆమె ఇమేజ్ మీదే సినిమాను నడిపించాలని అనుకుని ఉండొచ్చు.

అయినా సరే.. ఆమె ఇమేజ్‌కు తగ్గట్లు పేరున్న నటుడినే తీసుకుని ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ చిత్రంలో ఈషా రెబ్బా మరో ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.