సమతూకం పాటిస్తున్న షర్మిల ?

తొందరలోనే పార్టీ ఏర్పాటు చేయబోతున్న షర్మిల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. మిశ్రమ పద్దతిలో యువతను, సీనియర్లను తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయటానికి ఎక్కువమంది యువతకు పట్టం కట్టాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అలాగే వారిని మార్గదర్శనం చేసేందుకు, వ్యూహాలు రచించేందుకు సీనియర్ల సేవలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

దీనికి తగ్గట్లే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో బాగా సాన్నిహిత్యం ఉన్న అనేకమందితో షర్మిల రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అచ్చంగా రాజకీయ నేతలనే కాకుండా వైఎస్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వైఎస్ అభిమానులు, మద్దతుదారులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

వైఎస్ కు బాగా సన్నిహితంగాను, సలహాదారులుగాను పనిచేసిన వారిని పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే పార్టీ పేరును ప్రకటించేలోగానే యువత+సీనియర్లతో గట్టి బృందాన్ని తయారు చేసుకునే పనిలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో ఒకపుడు బాగా వెలుగు వెలిగిన ఓ మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల సీరియస్ గానే ఉన్నదని అర్ధమవుతోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్లోనే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జెండా, అజెండా రెడీ చేస్తున్నట్లు షర్మిలే స్వయంగా చెప్పారు కాబట్టి తొందరలో బ్రహ్మాండంగా పార్టీ లాంచింగ్ ఉండేట్లు చూసుకుంటున్నారు. చూద్దాం పార్టీలో ఎవరెవరు చేరుతారనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.