మెగా కుర్రాడికి మూడు కోట్లివ్వనున్న నాగ్


కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. అక్కినేని నాగార్జునతో మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ పని చేయనున్నాడు. ఈ మెగాస్టార్ చిన్న మేనల్లుడితో సినిమా నిర్మించడానికి నాగ్ సన్నాహాలు పూర్తి చేశాడు. ‘మనం ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నాగ్ నిర్మించబోయే సినిమాలో వైష్ణవ్ నటించనున్న విషయాన్ని ఇక అధికారికంగానే ప్రకటించబోతున్నారు. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

తాను హీరోగా సొంత బేనర్లో సినిమాలు చేయడమే కాక.. అప్పుడప్పుడూ బయటి యంగ్ హీరోలను పెట్టి సినిమాలు తీస్తుంటాడు నాగ్. ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి’ నుంచి ‘రంగుల రాట్నం’ వరకు ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు నిర్మించాడు. ఐతే ‘రంగుల రాట్నం’తో గట్టి ఎదురు దెబ్బ నాగ్.. కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఐతే ఓ మంచి కథ తన దగ్గరికి రావడం, ‘ఉప్పెన’తో ఘనంగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ ఆ కథకు సరిపోతాడనిపించడంతో చిరంజీవిని అడగడం, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వైష్ణవ్ తేజ్ అందుకోబోయే పారితోషకం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైష్ణవ్‌‌కు నాగ్ రూ.3 కోట్ల దాకా పారితోషకం ఇచ్చే అవకాశాలున్నాయట.

ఎందుకంటే వైష్ణవ్ ఇప్పుడు ఆ మొత్తంలోనే డిమాండ్ చేసే స్థితిలో ఉన్నాడు. తొలి సినిమా ‘ఉప్పెన’కు పుచ్చుకున్నది 50 లక్షల రూపాయలే. ఐతే ‘ఉప్పెన’ సినిమా భారీ విజయం సాధించడం, వైష్ణవ్‌కు మంచి పేరు రావడంతో డిమాండ్‌కు తగ్గట్లే అతను రెమ్యూనరేషన్‌ అడుగుతున్నట్లు తెలిసింది. బయటి నిర్మాతలనైతే వైష్ణవ్ ఈ మేరకే డిమాండ్ చేస్తున్నాడట. నాగ్ కూడా ఆ మేరకే అతడికి పారితోషకం ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.