పెద్ద స్టార్లు ఇద్దరూ తెగేసి చెప్పేశారు

దాదాపు 2 నెలలుగా లాక్‌డౌన్ పొడగిస్తూ పోతుండడంతో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేది అనుమానంగా మారింది. దాంతో నేరుగా ఓటీటీ రిలీజ్ మాట బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని చిత్రరంగాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యాయి కూడా. తమిళంలో హీరో సూర్య భార్య జ్యోతిక సినిమా కూడా పొన్మగాల్ వందాళ్ సినిమాను డైరక్టుగా ఓటిటి రిలీజుకు ఇచ్చేశారు. దానితో పెద్ద వివాదమే నడుస్తోంది.

ఇకపోతే ఎన్ని నెలల లేట్ అయినా పర్లేదు… వెయిట్ చేస్తాం కానీ ఓటీటీ రిలీజ్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు కొందరు తెలుగు హీరోలు. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఇదే మాట అంటున్నారు. కోలీవుడ్ ‘తలపతి’ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు.

అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ సినిమాను మే1న రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేశారు. కానీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఈ సినిమాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. అయితే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు ఈ ఇద్దరు స్టార్లు ‘నో’ చెప్పేశారు.

‘మేం సినిమాలు చేసేది అభిమానుల కోసం… థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్ కోసం…’ అంటూ ఓటీటీ ఆఫర్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడట విజయ్. ధనుష్ కూడా లేట్‌గా అయినా వస్తా కానీ ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయమని తెగేసి చెప్పాడట. దీంతో స్టార్ల సినిమాలతో క్రేజ్ పెంచుకోవాలనుకున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇదంతా సూర్య మీద వచ్చిన నెగెటివ్ రియాక్షన్ చూసే అంటున్నారు కొందరు సినిమావర్గీయులు.