వేలంలో స‌న్‌రైజ‌ర్స్.. జోకులే జోకులు

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ కొత్త సీజ‌న్ ముంగిట ప్ర‌తిసారీ వేలం జ‌ర‌గ‌డం మామూలే. ముందు ఏడాది ఫెయిలైన ఆట‌గాళ్లు కొంద‌రిని విడిచిపెట్టి ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేసుకోవ‌డం కోసం, అలాగే కొత్త అవ‌స‌రాల కోసం ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంఛైజీలు సిద్ధ‌మ‌వుతాయి. ఈ సారి నిజానికి మూడేళ్ల‌కోసారి జ‌రిగే మెగా వేలం నిర్వ‌హించాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా గ‌త సీజ‌న్ వాయిదా ప‌డి అక్టోబ‌రులో జ‌ర‌గ‌డం, త‌ర్వాతి ఐపీఎల్‌కు పెద్ద‌గా గ్యాప్ లేక‌పోవ‌డంతో మినీ వేలం నిర్వ‌హిస్తున్నారు.

ఐతే మిగ‌తా జ‌ట్ల‌న్నీ కాస్త ఎక్కువ సంఖ్య‌లోనే ఆట‌గాళ్ల‌ను వ‌దులుకున్నాయి. వారి స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌డం కోసం కాస్త ఎక్కువ డ‌బ్బుతోనే వేలంలోకి దిగాయి. కానీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం దాదాపుగా త‌మ జ‌ట్టునంతా అలాగే అట్టిపెట్టుకుంది. జ‌ట్టుకు ఆడే రెగ్యుల‌ర్ ఆట‌గాళ్లెవ‌రినీ విడిచి పెట్ట‌లేదు. ఆస్ట్రేలియా ఆట‌గాడు స్టాన్‌లేక్‌తో పాటు కొంద‌రు దేశ‌వాళీ ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే వదులుకుంది.

ఈసారి అతి త‌క్కువ డ‌బ్బులతో (రూ.10.75 కోట్లు) రంగంలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్.. వేలంలో వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మిగ‌తా జ‌ట్ల‌న్నీ ఆట‌గాళ్ల కోసం పోటా పోటీకి దిగుతుంటే.. త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు ఉన్నారు స‌న్‌రైజ‌ర్స్ బృందం. ఆట‌గాళ్ల పేర్లు వేలానికి వ‌స్తుంటే దాంతో త‌మ‌కేం ప‌ని అన్న‌ట్లుగా కులాసాగా క‌బుర్లు చెబుతూ కూర్చున్నారు ల‌క్ష్మ‌ణ్ అండ్ కో. ఇది చూసి మ‌న నెటిజ‌న్లు ఊరుకుంటారా? మీమ్స్ మోత మోగించేశారు.మిర‌ప‌కాయ్ సినిమాలో ధ‌ర్మ‌వ‌రపు సుబ్ర‌హ్మ‌ణ్యం కాలేజీ స్టాఫ్ రూంలో ముచ్చ‌ట్లు పెట్టే సీన్, స్వ‌యంవ‌రం మూవీలో ఆలీ హోటల్లో అదుందా ఇదుందా అని అడిగి చివ‌రికి టీ చెప్పే సీన్.. ఇలా ఏవేవో సినిమా స‌న్నివేశాల‌ను తీసుకొచ్చి ల‌క్ష్మ‌ణ్ బృందం వేలానికి వ‌చ్చారా ముచ్చ‌ట్లు చెప్ప‌డానికి వ‌చ్చారా అన్న‌ట్లు కౌంట‌ర్లు వేశారు.

పెద్ద వేలాల జోలికి అస‌లే వెళ్ల‌ని స‌న్‌రైజ‌ర్స్ త‌మిళ‌నాడు ఆట‌గాడు సుచిత్ స‌హా కొంద‌రు చిన్న ఆట‌గాళ్ల కోసం పోటీ ప‌డింది. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టులో స్లాట్స్ ప్ర‌కారం చూస్తే ముగ్గురు న‌లుగురు ఆట‌గాళ్ల‌ను బ్యాక‌ప్ కోసం తీసుకోవ‌డం త‌ప్పితే వారికి పెద్ద‌గా అవ‌స‌రాల్లేక‌పోవ‌డ‌మే వేలంలో ఇలా నామ‌మాత్రంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న‌ది స్ప‌ష్టం.