దృశ్యం-2 తెలుగు రీమేక్ ఫిక్స్?

ఇది ఒక రకంగా సంచలన విషయమే. చడీచప్పుడు లేకుండా ‘దృశ్యం-2’ రీమేక్‌కు తెలుగులో సన్నాహాలు జరిగిపోయాయట. మలయాళంలో ఈ చిత్రాన్ని తీసిన జీతు జోసెఫే తెలుగులోనూ డైరెక్ట్ చేయబోతున్నాడట. లొకేషన్ల ఎంపిక కోసం ఆయన ఆల్రెడీ హైదరాబాద్ చేరుకుని ఒక టీంతో కలిసి తిరిగేస్తున్నాడట. ఇంకొన్ని రోజుల్లోనే ప్రి ప్రొడక్షన్ అంతా అయిపోతుందని, మార్చిలో షూటింగ్ మొదలవుతుందని, ఒరిజినల్‌ను తీసినట్లే నెలా నెలన్నరలో ఈ సినిమాను అవగొట్టేయబోతున్నారని సమాచారం.


మరో సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుందని, వెంకటేషే సీక్వెల్లోనూ నటిస్తాడని సమాచారం. ఇది అనుకోకుండా కుదిరిన ప్రాజెక్టని, అతి తక్కువ రోజుల్లో సినిమా ఓకే అయిందని, రికార్డు వేగంతో సినిమాను రిలీజ్‌కు రెడీ చేసి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం.

2015లో విడుదలై మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడా మంచి ఫలితాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తమిళం, హిందీ, కన్నడ, భాషల్లోనూ రీమేక్ అయింది. అన్ని చోట్లా విజయం సాధించింది. ఒరిజినల్ వచ్చిన ఐదేళ్ల తర్వాత మలయాళంలో ఈ చిత్రానికి సీక్వెల్ తీశాడు జీతు జోసెఫ్. కరోనా బ్రేక్‌లో స్క్రిప్టు రెడీ చేసి.. లాక్ డౌన్ షరతులు తొలగిపోగానే సినిమాను మొదలుపెట్టి కేవలం నెలన్నరలో పూర్తి చేశాడు.


సీక్వెల్లోనూ మోహన్ లాల్, మీనాలే జంటగా నటించారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ శుక్రవారమే ప్రిమియర్స్ పడుతున్నాయి. ఐతే ‘దృశ్యం’ వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మలయాళ సినిమాలను ఓటీటీల్లో జనాలు బాగా చూస్తున్నారు. ‘దృశ్యం-2’ అంటే ప్రత్యేక ఆసక్తి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువమంది చూసే అవకాశముంది. మరి ఇలాంటి సినిమాను మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరముందా అన్నది ప్రశ్న.