నాగ్ నోట ‘క్రాక్’ మాట

ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ గురించి బహిరంగ వేదికల్లో పాజిటివ్‌గా మాట్లాడటం ఆసక్తి రేకెత్తించే విషయమే. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అలాంటి బేషజాలేమీ లేకుండా మిగతా హీరోల సినిమాల గురించి మాట్లాడే వాళ్లలో అక్కినేని నాగార్జున ఒకరు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటుడిగా అవకాశాలు అందుకుని.. ఆ తర్వాత హీరోగా ఎదిగి పెద్ద స్థాయికి వెళ్లిన మాస్ రాజా రవితేజ గురించి తన మేనల్లుడు సుమంత్ నటించిన ‘కపటధారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా విరామం తర్వాత సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా, చేస్తే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా లేదా అని భయపడుతున్న సమయంలో సంక్రాంతికి రిలీజైన రవితేజ సినిమా ‘క్రాక్’ అద్భుతంగా ఆడిందని.. పరిశ్రమలోని అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చిందని నాగార్జున అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహాన్ని తాజాగా రిలీజైన ‘ఉప్పెన’ చిత్రం రెట్టింపు చేసిందని నాగ్ అన్నాడు.

‘ఉప్పెన’ చాలా పెద్ద విజయం సాధించిందని, ఇండస్ట్రీకి ఎనలేని ధైర్యాన్నిచ్చిందని నాగ్ అభిప్రాయపడ్డాడు. కొత్త హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇలాంటి అరంగేట్రం దక్కడం తనకు చాలా ఆనందంగా ఉందని, అతడికి అభినందనలు చెబుతున్నానని నాగ్ అన్నాడు. ఇక సినిమాలు ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చనే ధీమాను ఈ రెండు చిత్రాలు టాలీవుడ్‌కు ఇచ్చాయన్న నాగ్.. సినిమా బాగుంటే తాము థియేటర్లకు వచ్చి చూస్తామని ప్రేక్షకులు చాటి చెప్పారని, ఈ నేపథ్యంలోనే సుమంత్ సినిమా ‘కపటధారి’ని కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పాడు.

ఈ సినిమా కన్నడలో చాలా బాగా ఆడిందని, తర్వాత తమిళంలో రీమేక్ చేసి రిలీజ్ చేస్తే అక్కడా మంచి ఫలితాన్నందుకుందని, కమర్షియల్ సక్సెస్ కావడమే కాక క్రిటికల్ అక్లైమ్ కూడా తెచ్చుకుందని.. తెలుగులోనూ ‘కపటధారి’కి అలాంటి ఫలితమే దక్కుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు నాగ్. ఈ సినిమా తాను చూడలేదని, ట్రైలర్ చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపించిందని, సుమంత్‌కు కచ్చితంగా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉందని నాగ్ పేర్కొన్నాడు.